భువన్ యాప్ ద్వారా వివరాల సేకరణ
హైదరాబాద్, అక్టోబర్ 20 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో ఇండ్లను జియో ట్యాగింగ్ చేసే ప్రక్రియ ముమ్మరంగా కొనసాగుతున్నది. మున్సిపల్ కార్పొరేషన్లు, మున్సిపాలిటీల్లో పన్ను పరిధిలోకి వచ్చే మొత్తం 20,57,441 ఇండ్లలో ఇప్పటివరకు 12,57,364 ఇండ్లకు (59.59 శాతం) జియో ట్యాగింగ్ పూర్తయింది. వరంగల్ కార్పొరేషన్లో అత్యధికంగా 2,10,359 ఇండ్లు ఉండగా.. 56,408 ఇండ్లకు జియో ట్యాగింగ్ చేశారు. 27 మున్సిపాలిటీల్లో 90 శాతం ఇండ్లకు ట్యాగింగ్ పూర్తి అయింది. అన్ని మున్సిపాలిటీల్లోని ఇండ్లకు వచ్చే నెలాఖరులోగా ట్యాగింగ్ పూర్తిచేసేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. పన్ను చెల్లింపుల్లో పారదర్శకతను, జవాబుదారీతనాన్ని పెంపొందించాలన్న ధ్యేయంతో గతేడాది జూలైలో జియో ట్యాగింగ్కు శ్రీకారం చుట్టారు. దీనికోసం నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్ (ఎన్ఆర్ఎస్సీ)తో మున్సిపల్శాఖ ఒప్పందం చేసుకొన్నది. ఎన్ఆర్ఎస్సీ ఆధ్వర్యంలోని భువన్ యాప్ ద్వారా నగరాలు, పట్టణాల్లోని ఇండ్ల వివరాలన్నీ సేకరించి ఆన్లైన్లో అప్లోడ్ చేస్తున్నది. ఈ ప్రక్రియ పూర్తయితే పట్టణాల్లోని ఇండ్లన్నింటినీ జియో ట్యాగింగ్ చేసిన తొలి రాష్ట్రంగా తెలంగాణ నిలువనున్నది.
మున్సిపల్ సిబ్బంది పట్టణాల్లోని ప్రతి ఇంటినీ రెండు వైపుల నుంచి ఫొటోలు తీస్తారు. ఒకే ప్రాంగణంలో రెండు ఇండ్లున్నా లేక ఒకే భవనానికి రెండు మూడు ఇంటి నంబర్లు ఉన్నా ఒకే నంబర్ను యూనిట్గా పరిగణించి ఆ ఇంటి వివరాలను, ఫొటోలను మొబైల్ యాప్లో ఆప్లోడ్ చేస్తారు. దీంతో ఆ ఇంటి పన్నును అధికారులు సరిగానే అసెస్మెంట్ చేశారో లేదో ఎక్కడి నుంచైనా తెలుసుకునేందుకు వీలవుతుంది.
పరిగి 99.51%
బెల్లంపల్లి 98.99%
రామగుండం 98.92%
తూంకుంట 98.63%
మధిర 98.39%
వైరా 98.30%
ఆధిభట్ల 97.33%
తుక్కుగూడ 97.27%
కొడంగల్ 97.15%
పెద్ద అంబర్పేట 96.25%