ఫిబ్రవరిలో సార్వత్రిక సమ్మె : ఏఐటీయూసీ
హిమాయత్నగర్, జనవరి 8: కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న కార్మిక, రైతు, ప్రజా వ్యతిరేక విధానాలను తిప్పికొట్టేందుకు బలమైన ప్రజా ఉద్యమాలు కొనసాగించాలని ఏఐటీయూసీ జాతీయ ప్రధాన కార్యదర్శి అమర్జిత్కౌర్, జాతీయ కార్యదర్శి డాక్టర్ బీవీ విజయలక్ష్మి పిలుపునిచ్చారు. శనివారం హిమాయత్నగర్లోని ఎస్ఎన్రెడ్డి భవన్లో వారు మీడియాతో మాట్లాడారు. కేంద్రం ప్రైవేటు, కార్పొరేట్తోపాటు స్వదేశీ సంస్థలకు తొత్తుగామారి దేశ ఆర్థికపరిస్థితిని చిన్నాభిన్నం చేస్తున్నదని విమర్శించారు. దేశంలో నిరుద్యోగ సమస్య జటిలమవుతున్నదని, పట్టణప్రాంత ప్రజల పరిస్థితులు దుర్భరంగా మారాయని ఆందోళన వ్యక్తంచేశారు. ఉద్యోగాల కల్పనలో కేంద్రం పూర్తిగా విఫలమైందని, ప్రైవేటీకరణను వేగవంతం చేసిందని ఆరోపించారు. ప్రజలను, దేశాన్ని కాపాడాలనే నినాదంతో ఫిబ్రవరి 23, 24 తేదీల్లో దేశవ్యాప్తంగా జరిగే సార్వత్రిక సమ్మెను విజయవంతం చేసేందుకు కార్మికవర్గం సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. సమావేశంలో ఏఐటీయూసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వీఎస్ బోస్, కోశాధికారి పీ ప్రేంపావని పాల్గొన్నారు.