న్యూఢిల్లీ: భారతీయ వ్యాపారవేత్త గౌతమ్ ఆదానీ ఇప్పుడు ప్రపచంలో అత్యంత సంపన్నుల జాబితాలో మూడవ స్థానంలో ఉన్నారు. బ్లూమ్బర్గ్ బిలియనీర్స్ డేటా ఈ విషయాన్ని వెల్లడించింది. ఆయన ఆస్తులు సుమారు 137 బిలియన్ల డాలర్లు ఉన్నట్లు తెలుస్తోంది. ప్రపంచంలో టాప్ ప్లేస్లో ఉన్న కుబేరుల్లో ఎలన్ మస్క్, జెఫ్ బేజోస్ ఉన్నారు. ఆ తర్వాత స్థానంలో 60 ఏళ్ల బిజినెస్ టైకూన్ గౌతమ్ అదానీ నిలిచారు.
టెస్లా చీఫ్ ఎలన్ మస్క్ ఆస్తులు 251 బిలియన్ల డాలర్లు కాగా, అమెజాన్ ఫౌండర్, సీఈవో జెఫ్ బేజోస్ ఆస్తుల విలువ 153 బిలియన్ల డాలర్లుగా ఉన్నట్లు బ్లూమ్బర్గ్ పేర్కొన్నది. ఫ్రెంచ్ వ్యాపారవేత్త లూయిస్ విటాన్ వ్యవస్థాపకుడు బెర్నార్డ్ అర్నాల్ట్ ను దాటేసి అదానీ మూడవ స్థానానికి చేరుకున్నారు.
బ్లూమ్బర్గ్ నివేదిక ప్రకారం.. ఆసియాకు చెందిన సంపన్నుల్లో తొలిసారి ఆ జాబితాలో చేరారు. భారత టైకూన్ ముఖేశ్ అంబానీ, చైనాకు చెందిన అలీబాబా గ్రూపు జాక్ మా సంపన్నుల జాబితాలో ఉన్నా.. వాళ్లెప్పుడు కూడా టాప్ త్రీ ప్లేస్లోకి రాలేదు.
అదానీ గ్రూపు సహ వ్యవస్థాపకుడు గౌతమ్ అదానీ. దేశంలోనే అతి పెద్ద పోర్ట్ ఆపరేటర్. బొగ్గు వ్యాపారంలోనూ అదానీ గ్రూపు అగ్ర స్థానంలో ఉంది. 2021, మార్చి 31 నాటికి ఆ సంస్థ సుమారు 5.3 బిలియన్ల డాలర్ల రెవన్యూను ఆర్జించింది. ఎన్డీటీవీలో 29 శాతం వాటాను కొనుగోలు చేయనున్నట్లు అదానీ సంస్థ గత వారం ఓ ప్రకటన చేసింది.