భోపాల్, అక్టోబర్ 24: ‘మధ్యప్రదేశ్లో ఖాళీ సిలిండర్ బుడ్డీలు పాత ఇనుప సామాను దుకాణాల్లో గుట్టల్లా పేరుకుపోతున్నాయి. పెరిగిన గ్యాస్ ధరలను భరించలేక పేదలు సిలిండర్లను నింపించుకోవడం(రీ ఫిల్) లేదు. ఉజ్వల యోజన కింద ఇచ్చిన సిలిండర్లను పాత ఇనుప సామాన్ల కింద అమ్ముకొంటున్నారు’ అని ఆ రాష్ట్ర కాంగ్రెస్ చీఫ్, మాజీ సీఎం కమల్నాథ్ ఆరోపించారు. భిండ్ జిల్లాలోని ఓ దుకాణంలో పేరుకుపోయిన సిలిండర్ల వీడియోను ట్వీట్ చేశారు. ప్రధాని మోదీ పాలనలో ద్రవ్యోల్బణం నియంత్రించలేనంతగా పెరిగిందనడానికి ఈ సిలిండర్లే నిదర్శనం అంటూ విమర్శించారు. ‘మేం కార్మికులం. మాకు నలుగురు పిల్లలు. గ్యాస్ రేటు భరించలేనంతగా పెరిగిపోయింది. సిలిండర్ రేటు రూ.600 దాటినప్పటి నుంచి తిరిగి నింపించడం మానేశాం’ అని ఓ కుటుంబం తెలిపింది. కొన్ని సందర్భాల్లో ప్రజలు సిలిండర్ రీ ఫిల్ కోసం బుక్ చేసుకొంటున్నారని, కానీ ఇంటికి వెళ్లాక రేటు తెలిసి ‘మాకు వద్దు’ అంటూ సమాధానం ఇస్తున్నారని గ్యాస్ ఏజెన్సీల ఉద్యోగులు చెప్తున్నారు. 2014 మార్చి 1న 14.2 కిలోల గ్యాస్ సిలిండర్ ధర రూ.410.5 కాగా, ప్రస్తుతం రూ.952కు పెరిగింది.