ఇచ్చోడ: గాంధీజీ కలలుగన్న గ్రామ స్వరాజ్యాన్ని సీఎం కేసీఆర్ నిజం చేస్తున్నారని ముక్రా (కే) గ్రామ సర్పంచ్ గాడ్గె మీనాక్షి అన్నారు. అసెంబ్లీలో ముక్రా (కే) గ్రామ పంచాయతీ గురించి సీఎం కేసీఆర్ ప్రస్తావించడం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ శనివారం ముక్రా (కే) జీపీ కార్యాలయం ఆవరణలో సీఎం కేసీఆర్ ఫ్లెక్సీకి గ్రామస్తులు క్షీరాభిషేకం చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడారు. అయిదు వందల జనాభా ఉన్న తండాలు, గూడెంలను ప్రత్యేక గ్రామపంచాయతీ కార్యాలయాలుగా ఏర్పాటు చేసి, పల్లెల అభివృద్ధికి కంకణం కట్టుకున్నారని పేర్కొన్నారు.
పల్లె ప్రగతి పథకంతో గ్రామాల రూపు రేఖలను మారుస్తూ కొత్త ఒరవడికి శ్రీకారం చుట్టారని కొనియాడారు. ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ గాడ్గె సుభాశ్, ఉప సర్పంచ్ వర్షతాయి, పాలక వర్గం సభ్యులు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.