క్రిటికల్ కేర్కు ప్రత్యేక ఐసీయూ
పిల్లలకు సంబంధించి 300 ఐసీయూ పడకలు
టిమ్స్లో ఒమిక్రాన్ చికిత్సకు ప్రత్యేక వార్డులు
వేవ్తో పెద్దగా ప్రమాదం లేనప్పటికీ.. ముందస్తుగా చర్యలు
సిటీబ్యూరో, డిసెంబరు 27: రాష్ట్రంలో కరోనా మొదటి, రెండో దశలను సమర్ధవంతంగా ఎదుర్కొని వేలాది మంది రోగులకు ప్రాణం పోసిన గాంధీ దవాఖాన థర్డ్ వేవ్ వచ్చినా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉంది. ఇప్పటికే నాన్ కొవిడ్, కొవిడ్ సేవలందిస్తున్న గాంధీ వైద్యులు ఒమిక్రాన్ రోగులకు సైతం వైద్యం అందించేందుకు సన్నద్ధమయ్యారు. దేశంలో ఒమిక్రాన్ కేసుల సంఖ్య రోజురోజుకు పెరుగుతున్న దృష్ట్యా, ఒక వేళ థర్డ్ వేవ్ వస్తే ప్రభుత్వం ఆదేశాల మేరకు వైద్యసేవలు అందించేందుకు సిద్ధంగా ఉన్నట్లు గాంధీ దవాఖాన సూపరింటెండెంట్ డాక్టర్ రాజారావు స్పష్టం చేశారు. ప్రస్తుతం ఉన్న సమాచారం ప్రకారం, ఒమిక్రాన్ వేరియెంట్ వ్యాప్తి రేటు అధికంగా ఉన్నప్పటికీ రోగులపై జబ్బు ప్రభావం మాత్రం పెద్దగా లేదని, అయితే, రానున్న రోజుల్లో కేసుల సంఖ్య పెరిగే అవకాశాలుండటంతో థర్డ్ వేవ్ వచ్చినా సమర్ధవంతంగా ఎదుర్కొనేందుకు వైద్య, ఆరోగ్య శాఖ అన్ని చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా ఇప్పటికే టిమ్స్తో పాటు నిలోఫర్లో 800 అదనపు పడకలు, నగరంలోని ఏరియా హాస్పిటల్స్లో 792 పడకలను సిద్ధం చేసినట్లు ఇటీవలే వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు వెల్లడించిన విషయం తెలిసిందే. దీంతో పాటు క్రిటికల్ కేసులను ట్రీట్ చేసేందుకు మల్టీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటలైన గాంధీలో సైతం ప్రత్యేక ఐసీయూలను సిద్ధం చేశారు.
కేసుల ఆధారంగా పడకల పెంపు
ప్రస్తుతం గాంధీలో 2000 పడకలు అందుబాటులో ఉండగా అందులో 1500 పడకలకు ఆక్సీజన్ సౌకర్యం ఉంది. సెకండ్ వేవ్ తగ్గుముఖం పట్టడంతో 200 ఐసీయూ పడకలను కరోనా రోగులకు కేటాయించి మిగిలిన పడకలను సాధారణ రోగులకు అందుబాటులో ఉంచారు. గాంధీలో కేవలం కరోనా క్రిటికల్ కేసులను మాత్రమే తీసుకుంటున్న విషయం తెలిసిందే. స్వల్ప, మధ్యస్థ స్థాయి రోగులకు టిమ్స్, కింగ్ కోఠి, ఎర్రగడ్డ ఛాతి దవాఖాన తదితర వాటిల్లో చికిత్స అందించారు. ప్రస్తుతం, కరోనా కేసులు పూర్తిగా తగ్గుముఖం పట్టడంతో అన్ని కొవిడ్ సెంటర్లలో నాన్ కొవిడ్ సేవలను అందిస్తున్నారు. అయితే, ప్రస్తుతం ఒమిక్రాన్ కేసుల సంఖ్య పెరుగుతుండటంతో టిమ్స్లో ఒమిక్రాన్ చికిత్స కోసం ప్రత్యేక వార్డులను ఏర్పాటు చేశారు. వీటిలో క్రిటికల్ కేసులు ఏవైనా ఉంటే వాటిని గాంధీకి తరలించనున్నారు. ఈ మేరకు గాంధీలో ఇప్పటికే 200 ప్రత్యేక ఐజీయూ పడకలను అందుబాటులో ఉంచగా, కేసుల సంఖ్య ఆధారంగా ప్రభుత్వ ఆదేశాల ప్రకారం, గాంధీలో కొవిడ్ బెడ్స్ సంఖ్యను పెంచడం జరుగుతుందని గాంధీ అధికారులు చెబుతున్నారు.
చిన్నారుల కోసం 300 పడకలు..
ఒమిక్రాన్, థర్డ్ వేవ్ నేపథ్యంలో ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నట్లు గాంధీ వైద్యులు చెబుతున్నారు. థర్డ్ వేవ్ను దృష్టిలో పెట్టుకుని ముందస్తు చర్యగా గాంధీలో 300 ఐసీయూ పడకలను అందుబాటులో ఉంచినట్లు గాంధీ సూపరింటెండెంట్ డాక్టర్ రాజారావు తెలిపారు. పిల్లల కోసం ప్రత్యేక వెంటిలెటర్లు, ఆక్సీజన్తో పాటు ఇతరత్రా అవసరమైన అన్ని రకాల ముందస్తు చర్యలు సిద్ధం చేసినట్లు తెలిపారు. అయితే, వైరస్ తీవ్రత అనేది ప్రాంతాల ఆధారంగా ఉంటుందని, ఇన్ఫ్లూయెంజా అనేది మన దగ్గర సాధారణ జలుబుగా పరిగణిస్తామన్నారు. అదే యూఎస్, యూకే, ఆస్ట్రేలియా దేశాలలో మాత్రం ఈ జలుబు(ఇన్ఫ్లూయెంజా) దాటికి 5 శాతం మరణాలు సంభవిస్తాయని వివరించారు. ఈ క్రమంలోనే ఒమిక్రాన్ వల్ల యూఎస్, ఆఫ్రికా దేశాలలో పిల్లలు ఆస్పత్రి పాలవుతున్నారని, అయినప్పటికీ వారిలో కూడా పెద్దగా సీవియారిటీ లేదని చెప్పారు. పిల్లలపై కరోనా థర్డ్ వేవ్ వచ్చినా పెద్దగా ప్రభావం ఉండకపోవచ్చని, అయినప్పటికీ ముందు జాగ్రత చర్యగా అప్రమత్తంగా ఉండి, అవసరమైన అన్ని ఏర్పాట్లతో ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నట్లు వివరించారు.