ఇంట్లో ఫ్యాన్ ఆఫ్ చేయటం మర్చిపోయి బయటికి వెళ్తాం. వచ్చే వరకూ ఆ ఫ్యాన్ తిరుగుతూనే ఉంటుంది. ఫలితం.. అటు బిల్లుతో జేబుకు చిల్లు, ఇటు కరెంటు వృథా. ప్రతి ఇంట్లో ఇవి జరగటం సర్వసాధారణం. ఈ వృథా కు, డబ్బు ఆదాకు పరిష్కారమే ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ (ఐవోటీ). గృహోపకరణాలకు ఇంటర్నెట్ కనెక్ట్ అయ్యి ఉంటే చాలు ఎక్కడినుంచైనా ఆన్ చేసుకోవచ్చు, ఆఫ్చేసుకోవచ్చు. ఇప్పుడిదే ట్రెండ్. సౌకర్యవంతమైన జీవితానికి డిమాండ్ పెరుగుతున్నది. శక్తి వనరుల వృథాను అరికట్టి, ఇంధనాన్ని పొదుపుగా వాడేందుకు, డబ్బును ఆదా చేసుకొనేందుకు అందివచ్చిందే ఐవోటీ టెక్నాలజీ.
హైదరాబాద్, డిసెంబర్ 14 (నమస్తే తెలంగాణ): ఇల్లు స్మార్ట్.. ఇంట్లో వస్తువులు స్మార్ట్. ఒక గదిలో టీవీ ఉన్నా, వేరే గదిలోకి వెళ్లి ఆన్/ఆఫ్ చేసుకొనేంత స్మార్ట్. ఇదే ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ స్మార్ట్నెస్. మిక్సీలు, గ్రైండర్లు, వాషింగ్ మిషన్లు, కూలర్లు, వ్యాక్యూమ్ క్లీనర్లు, మైక్రో ఓవెన్లు, కాఫీ మిషన్లు, ఎల్ఈడీ టీవీలు, రిఫ్రిజిరేటర్లు, ఏసీలు ఇలా అనేక గృహోపకరణాలు ఐవోటీగా మారిపోతున్నాయి. ఒక్క గృహోపకరణాలే కాదు.. ఇంటి భద్రత, విద్యుత్తు వినియోగం, వంట గ్యాస్ లీకేజీ నిరోధం, అగ్ని ప్రమాదాల నివారణ, నీటి సంరక్షణ ఇలా అనేక అంశాల్లో ఐవోటీ కీలక భూమిక పోషిస్తున్నది. చేయి కదపకుండానే అడుగుల అలికిడితో సెన్సర్ల ద్వారా తలుపులు తెరుచుకోవటం, బల్బులు వెలగటం, ఫ్యాన్లు తిరగటం లాంటివి ఐవోటీ పుణ్యమే.
విద్యుత్తు ఆదా చేసే స్మార్ట్ పరికరాలు
ఒకప్పుడు సాధారణ బల్బులు వాడేవారు. వాటి స్థానంలో ఎల్ఈడీ బల్బులు వచ్చాయి. ఇప్పుడు స్మార్ట్ బల్బులు వచ్చేశాయి. మోషన్ సెన్సర్లతో పనిచేసేవి అంటే అడుగుల చప్పుడు/ చప్పట్ల చప్పుడు వినిపిస్తే చాలు వాటికవే వెలుగుతాయి. వాటికవే ఆఫ్ అయిపోతాయి. అలెక్సా వంటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పరికరాలతో పనిచేసే బల్బులు కూడా అందుబాటులో ఉన్నాయి. అలెక్సా సహాయంతో లైట్లను ఆన్/ఆఫ్ చేయటంతో పాటు, ఎంత వెలుతురు కావాలనేది కూడా నిర్ణయించుకోవచ్చు. దీంతో విద్యుత్తు ఆదా చేసుకోవచ్చు. హీటర్లు, గీజర్లు, ఐరన్ బాక్స్లు కూడా స్మార్ట్ టెక్నాలజీతో అందుబాటులోకి వచ్చాయి. అవసరం మేరకు, నిర్ణీత సామర్థ్యం మేరకు వాటిని ఉపయోగించుకోవచ్చు. అవసరాన్ని బట్టి, స్టోర్ చేయాల్సిన వస్తువుల సామర్థ్యాన్ని బట్టి ఫ్రిజర్ను, ఫ్రిజ్ను ఆన్/ఆఫ్ చేసుకోవచ్చు. కీలకాంశం ఏంటంటే 2018-19 నాటికి దేశంలో 13.7 శాతం ఇండ్లు హోమ్ ఆటోమేషన్ టెక్నాలజీని వాడేస్తున్నాయి.