Delhi Assembly : ఢిల్లీ అసెంబ్లీకి మరోసారి బాంబు బెదిరింపు మెయిల్ వచ్చింది. ఢిల్లీ అసెంబ్లీలో 16 కిలోల ఆర్డీఎక్స్ ఐఈడీలు అమర్చామని, వాటిని మధ్యాహ్నం 01.40 గంటలకు పేల్చేస్తామని ఢిల్లీ అసెంబ్లీ స్పీకర్ విజేందర్ గుప్తాకు బుధవారం మెయిల్ వచ్చింది. ఈ విషయాన్ని పోలీసులకు, ఉన్నతాధికారులకు స్పీకర్ ఓఎస్డీ తెలిపారు. అతడి ఫిర్యాదుతో పోలీసులు, భద్రతా సిబ్బంది అప్రమత్తమయ్యారు.
ఢిల్లీ పోలీసులు, డాగ్ స్క్వాడ్, బాంబ్ స్క్వాడ్, డిస్పోజబుల్ టీమ్స్ సహా భద్రతా సిబ్బంది అసెంబ్లీ ప్రాంగణం చేరుకుని గట్టి భద్రతా చర్యలు చేపట్టారు. ప్రాంగణమంతా తనిఖీలు చేశారు. ప్రతి మూలలో, మొక్కలు, చిన్న కుండలు సహా ప్రతి చోటా వెతుకుతున్నారు. అసెంబ్లీకి వచ్చే ప్రజా ప్రతినిధులు, మీడియా, సందర్శకుల రక్షణ కోసం తగిన చర్యలు తీసుకుంటున్నామని అధికారులు తెలిపారు. 16 కిలోల ఆర్డీఎక్స్ ఉందని పేర్కొన్న నేపథ్యంలో మరింత అప్రమత్తంగా ఉన్నారు. అయితే, ఢిల్లీ అసెంబ్లీకి బాంబు బెదిరింపు రావడం ఇదే మొదటిసారి కాదు. మంగళవారం కూడా ఇదే తరహా బెదిరింపు మెయిల్ వచ్చింది. అది కూడా ఢిల్లీ అసెంబ్లీ స్పీకర్ విజేందర్ గుప్తాకే.
ప్రధాని మోదీ, హోం మంత్రి అమిత్ షా, ఢిల్లీ సీఎం రేఖా గుప్తా సహా ప్రముఖుల్ని చంపుతామని బెదిరింపు మెయిల్ వచ్చింది. దీంతో మంగళవారం కూడా తనిఖీలు చేసి, గట్టి భద్రత ఏర్పాటు చేశారు. వరుస బెదిరింపుల నేపథ్యంలో భద్రతను మరింత కట్టుదిట్టం చేశారు. ఢిల్లీ అసెంబ్లీలో ప్రస్తుతం బడ్జెట్ సమావేశాలు జరుగుతున్నాయి. బెదిరింపు మెయిల్స్ వస్తున్నప్పటికీ సమావేశాలు మాత్రం నిరంతరాయంగా కొనసాగుతుండటం విశేషం.