హైదరాబాద్ సిటీబ్యూరో, సెప్టెంబర్ 20 (నమస్తే తెలంగాణ): మెడికల్ సీట్లు ఇప్పిస్తానంటూ డబ్బులు కాజేసి, మోసం చేసిన ఒక బీజేపీ నాయకుడిని సీసీఎస్ పోలీసులు అరెస్టు చేశారు. జనగామ జిల్లా బీజేపీ నాయకుడు కొత్తపల్లి సతీశ్కుమార్ కొంతకాలంగా హైదరాబాద్లోని బోడుప్పల్-కమలానగర్లో నివసిస్తున్నారు. ఆయన 2018లో జనగామ నుంచి బహుజన సమాజ్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు. ఆ తరువాత బీజేపీలో చేరారు. ఇటీవల హైదరాబాద్కు చెందిన బాధితుడు తన కుమార్తెకు యాజమాన్య కోటాలో మెడికల్ సీటు కోసం సతీశ్కుమార్ను ఆశ్రయించాడు. బాచుపల్లిలోని ఒక మెడికల్ కాలేజీలో సీటు ఇప్పిస్తానని వారి వద్ద నుంచి రూ.48.53 లక్షలు వసూలు చేశాడు. సీటు ఖరారైనట్టు నకిలీ లేఖను సృష్టించి నమ్మించే ప్రయత్నం చేశాడు. బాధితుడు ఆ లేఖను కాలేజీకి తీసుకెళ్లడంతో అది నకిలీదని తేలింది. దీంతో తమ డబ్బులు వాపస్ ఇవ్వాలంటూ బాధితుడు ఒత్తిడి చేయడంతో సతీశ్కుమార్ వారికి రెండు చెక్కులు ఇవ్వగా బౌన్స్ అయ్యాయి. దీంతో బాధితుల ఫిర్యాదు మేరకు సీసీఎస్ పోలీసులు ఆయన్ను అరెస్టు చేసి కోర్టులో హాజరు పర్చగా నిందితుడికి రిమాండ్ విధించింది.