పుణె: భారత్, ఇంగ్లాండ్ మధ్య మంగళవారం జరిగిన తొలి వన్డేలో ఏకంగా నలుగురు ఆటగాళ్లు గాయపడ్డారు. భారత వైస్ కెప్టెన్ రోహిత్ శర్మ, శ్రేయస్ అయ్యర్..ఇంగ్లాండ్ సారథి ఇయాన్ మోర్గాన్, సామ్ బిల్లింగ్స్ మైదానంలో గాయపడటంతో తర్వాతి వన్డేకి అందుబాటులో ఉండేది అనుమానంగా మారింది. ఆయా ఆటగాళ్ల గాయాలపై ఇంకా స్పష్టత రాలేదు. తర్వాతి మ్యాచ్కు ఈ నలుగురు బరిలోకి దిగకపోవచ్చని తెలుస్తోంది. ఐతే ఏప్రిల్ 9 నుంచి ఐపీఎల్ 14వ సీజన్ ఆరంభంకాబోతుండగా టోర్నీ ఆరంభానికి ముందు తమ జట్టులోకి కీలక ఆటగాళ్లు గాయపడటంపై ఫ్రాంఛైజీలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.
ఇప్పటికే భారత్తో టీ20 సిరీస్లో మోచేతి నొప్పి తీవ్రస్థాయికి చేరడంతో స్టార్ ఆల్రౌండర్ జోఫ్రా ఆర్చర్ వన్డే సిరీస్తో పాటు ఐపీఎల్లోని తొలి భాగం మ్యాచ్లకు దూరమయ్యాడు. తాజాగా గాయపడిన వారిలో ముగ్గురు ఆటగాళ్లు కెప్టెన్లు కావడం గమనార్హం.
రోహిత్ ముంబై ఇండియన్స్, శ్రేయస్ ఢిల్లీ క్యాపిటల్స్, మోర్గాన్ కోల్కతా నైట్ రైడర్స్ జట్లకు సారథులుగా వ్యవహరిస్తున్నారు. ఐపీఎల్లో పాల్గొనే ఆటగాళ్లందరూ తమ జట్లు ఏర్పాటు చేసిన బయోబబుల్లోకి ప్రవేశించాలంటే ముందుగా వారం రోజుల తప్పనిసరి క్వారంటైన్ను ఆటగాళ్లు పూర్తి చేయాల్సి ఉంది. ప్రస్తుతం వన్డే సిరీస్లో ఆడుతున్న ఇరుజట్లలోని చాలా మంది ఆటగాళ్లు ఐపీఎల్లో కీలక ఆటగాళ్లుగా కొనసాగుతున్నారు. మిగతా రెండు వన్డేల్లోనూ ఎవరూ గాయపడకూడదని ఫ్రాంఛైజీలు కోరుకుంటున్నాయి.