హుస్నాబాద్ టౌన్, డిసెంబర్ 19: పండే పంట రైతులకు లాభాన్ని తెచ్చిపెట్టాలి. కడుపునిండా తిండి పెట్టాలి. ఆర్థికంగా నిలదొక్కుకోవటానికి అండనివ్వాలి. అలాంటి మద్దతు పొగాకుతో దొరుకుతున్నదని అంటున్నారు సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ ప్రాంత రైతులు. వరి పంటను కొనబోమని కేంద్ర ప్రభుత్వం తేల్చిచెప్పటంతో వాణిజ్య సాగు పై ఇక్కడి రైతులు దృష్టి సారించారు. ప్రధానంగా కరీంనగర్ జిల్లాలోని హుజూరాబాద్, జమ్మికుంట ప్రాంతాల్లో అధికంగా సాగుచేసే పొగాకు పంటను హుస్నాబాద్ ప్రాంత రైతులు సైతం చేపడుతున్నారు. పొద్దుతిరుగుడు, మినుములు, వేరుశనగ, కూరగాయలతో పాటు ఈ పంటను కూడా సాగు చేస్తున్నారు. వరుస తడులతో పంటను పండించుకొనే వీలుండటంతో పలువురు రైతులు పొగాకును సాగుచేస్తున్నారు. ఎకరానికి సరిపడా నారుకు ఐదు వేల రూపాయలు ఉండగా, నాలుగు మాసాల్లోనే పంట చేతికి వస్తుండటంతో రైతులు దీనివైపు మొగ్గు చూపుతున్నారు. ఎకరాకు రూ.25 వేల వరకు ఖర్చుపెట్టి దాదాపు రూ.80 వేల నుంచి రూ.1.20 లక్షల వరకు ఆదాయాన్ని సంపాదిస్తున్నారు.
ఎకరాకు 15 క్వింటాళ్ల వరకు దిగుబడి
పొగాకు ఆకు ఎంతపెద్దగా మందంగా ఉంటే అంత ఆదాయాన్ని తెచ్చిపెడుతుంది. ఎకరాకు 9 నుంచి 15 క్వింటాళ్ల వరకు దిగుబడి వస్తున్నది. నాలుగు నెలల్లో పంట చేతికి వస్తుంది. దీనికి క్వింటాలుకు రూ.9 వేల పైగా ధర పలుకుతున్నది. ఒక్క హుస్నాబాద్ మండలంలోనే 50 ఎకరాల్లో పొగాకును పండిస్తున్నారు. ఆ పంటను కరీంనగర్ జిల్లాలోని హుజూరాబాద్, జమ్మికుంట మార్కెట్లో అమ్ముకొంటున్నారు.
లాభాలు వస్తయని..
పోయిన ఏడాది 30 గుంటల్లో పొగాకు సాగు చేసిన. ఎనిమిది క్వింటాళ్ల దాక పంట వచ్చింది. క్వింటాలుకు రూ.8 వేల చొప్పున అమ్ముకొన్న. పెట్టుబడి రూ.20వేల దాకా అయ్యింది. పొగాకు పంటతో మంచి ఆదాయం వస్తున్నది.