నోయిడా : ఢిల్లీలో వాయు కాలుష్యం సమస్య తీవ్రరూపం దాల్చింది. ఇప్పటికే ఢిల్లీతో పాటు హర్యానాలోని పలు జిల్లాల్లో పాఠశాలలు మూతపడగా.. నిర్మాణాలు నిలిపివేశారు. తాజాగా ఢిల్లీ ఎన్సీఆర్ పరిధిలో ఉన్న యూపీలోని నోయిడాలో అన్ని రకాల నిర్మాణ పనులు, ఆర్ఎంసీ, హాట్ మిక్స్ప్లాంట్లు, డీజిల్ జనరేటర్ల వాడకాన్ని నాలుగు రోజుల పాటు గ్రేటర్ నోయిడా అథారిటీ నిషేధించింది. ఎయిర్ క్వాలిటీ మేనేజ్మెంట్ కమిషన్ సూచనల మేరకు అధికార యంత్రాంగం చర్యలు చేపట్టింది. ఈ మేరకు ఏసీఈవో దీప్చంద్రకు బాధ్యతలు అప్పగించినట్లు సీఈవో నరేంద్ర భూషణ్ తెలిపారు.
ఈ మేరకు చర్చలు జరిపి, మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. రెసిడెన్షియల్, కమర్షియల్, ఐటీ, ఇన్స్టిట్యూషనల్, బిల్డర్ ప్రాజెక్టులు, రోడ్ల రీ సర్ఫేసింగ్, కొత్త రోడ్ల నిర్మాణాలు నాలుగు రోజుల పాటు నిలిపివేస్తున్నట్లు పేర్కొన్నారు. ఎక్కడికక్కడ ధూళి ఎగిరే అవకాశం ఉంటే యాంటీ స్మోగ్ గన్లు వినియోగించాలని ఆదేశించారు. హాట్మిక్స్, ఆర్ఎంసీ ప్లాంట్లను మూసివేయాలని, హోటళ్లు, దాబాల్లో డీజిల్ జనరేట్ల వాడకంపై నిషేధించారు. ఆదేశాలను ఉల్లంఘిస్తే ఎన్జీటీ నిబంధనలు ప్రకారం చర్యలు తీసుకోవాలని అథారిటీ ఆదేశాలు జారీ చేసింది. ఈ సందర్భంగా చెత్తను కాల్చే వారిని గుర్తించి చర్యలు తీసుకునేందుకు ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేశారు.