సిటీబ్యూరో, డిసెంబర్ 5 (నమస్తే తెలంగాణ): ఫోర్జరీ డాక్యుమెంట్లతో ప్లాట్ను విక్రయిస్తానంటూ నమ్మించి రూ.1.1కోట్లు మోసం చేసిన కేసులో మరో నిందితుడిని సీసీఎస్ పోలీసులు అరెస్ట్ చేశారు. జాయింట్ సీపీ అవినాశ్ మహంతి కథనం ప్రకారం.. ఆఘాపూర్కు చెందిన సయ్యద్ షాహిద్, రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలం తొండుపల్లికి చెందిన పెదిరిపాటి శేఖర్గౌడ్ రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తుంటారు. వివాదాస్పదమైన స్థలాల క్రయ, విక్రయాల పేరుతో అమాయకులను మోసం చేస్తూ వచ్చిన డబ్బులో 60:40 శాతం పంచుకుంటారు. మూసాపేట్లోని ఓ ప్రైవేట్ కంపెనీకి సంబంధించిన 1500 గజాల స్థలానికి ఫోర్జరీ డాక్యుమెంట్లు తయారు చేశారు. ఆ డాక్యుమెంట్లను బంజారాహిల్స్కు చెందిన ఓ వ్యాపారికి చూపించి రూ.11.25 కోట్ల విలువైన స్థలాన్ని అమ్మేందుకు సిద్ధంగా ఉన్నామంటూ నమ్మించారు. ఆ పత్రాలను, స్థలాన్ని చూసిన సదరు వ్యాపారి రూ.1.10 కోట్లు అడ్వాన్స్గా ఇచ్చాడు. తరువాత ఆ స్థలం, డాక్యుమెంట్లను పరిశీలించగా అవన్నీ ఫోర్జరీవని తేలాయి. దీంతో బాధితుడు సీసీఎస్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఈ కేసులో గత 8వ తేదీన శేఖర్గౌడ్ను అరెస్ట్ చేశారు. తాజాగా మరో నిందితుడు సయ్యద్ షాహిద్ను అరెస్ట్ చేసి కోర్టులో హాజరు పరిచారు. సయ్యద్పై గతంలో మోసం, దాడులకు సంబంధించిన కేసులున్నాయి. కేసును ఏసీపీ బి.శ్రీనివాసరావు నేతృత్వంలోని బృందం దర్యాప్తు చేస్తుంది.