హైదరాబాద్, జనవరి 26 : అటవీ భూముల సమస్యకు త్వరలోనే పరిష్కారం లభిస్తుందని టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, పురపాలక, ఐటీశాఖ మంత్రి కే తారకరామారావు భరోసా ఇచ్చారు. ఆదివాసీలకు రాష్ట్ర ప్రభుత్వం అండగా ఉంటున్నదని, సమస్యల పరిష్కారమే తమ ధ్యేయమని చెప్పారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదివాసీ రైతులకు సంబంధించి అటవీశాఖ భూముల విషయంలో సానుకూలంగా వ్యవహరించాలని అధికారులను ఆదేశించిన విషయాన్ని కేటీఆర్ గుర్తుచేశారు. టీఆర్ఎస్ ఆదివాసీ ప్రజాప్రతినిధులు, ఆదివాసీ సంఘాల ప్రతినిధులు బుధవారం ప్రగతిభవన్లో మంత్రి కేటీఆర్ను కలిసి, ఆదివాసీల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. అటవీ భూముల సమస్యతో పాటు ఆదివాసీలకు విద్య, వైద్య రంగాల్లో మరింత మెరుగైన, నాణ్యమైన సేవలు అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తున్నదని వివరించారు. ఆదివాసీ ప్రజాప్రతినిధులు, వివిధ శాఖల అధికారులతో త్వరలో మరోసారి ప్రత్యేక సమావేశం ఏర్పాటుచేసి తీసుకోవాల్సిన చర్యలపై చర్చిస్తామని అభయమిచ్చారు. షెడ్యూల్డ్ ఏరియాలో ఆదివాసీల కోసం తీసుకోవాల్సిన అభివృద్ధి, సంక్షేమ చర్యలపై తమ అభిప్రాయాలను తెలపాలని కోరారు. కేంద్ర ప్రభుత్వ ఆర్వోఎఫ్ఆర్ చట్టం ప్రకారం హక్కుపత్రాలను అందజేసేందుకు కొన్ని పరిమితులు ఉన్నాయని, రాష్ట్ర ప్రభుత్వం సాధ్యమైనంత ఎక్కువ సానుకూల దృక్పథంతో వ్యవహరిస్తున్నదని మంత్రి కేటీఆర్ వివరించారు. ఆదివాసీల ‘మావ నాటే.. మావ రాజ్ (మా గూడెంలో మా రాజ్యం) నినాదం స్ఫూర్తితో టీఆర్ఎస్ ప్రభుత్వం గిరిజన తండాలు, ఆదివాసీ గూడేలను గ్రామ పంచాయతీలుగా మార్చిందని గుర్తుచేశారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత ఆదివాసీ ప్రాంతాలకు ప్రభుత్వ సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు వేగంగా అందుతున్నాయని చెప్పారు. గతంలో ఆదివాసీలకు వైద్యసేవలను అందించడంలో తీవ్ర అలసత్వం ఉండేదని, ఇప్పుడు పరిస్థితి మారిందని వివరించారు. ఆదివాసీలకు మరింత సహాయకారిగా ఉండేందుకు విద్య, వైద్యశాఖ అధికారులతో ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటుచేయాలని ప్రభుత్వాన్ని కోరతానని అభయమిచ్చారు. మంత్రిని కలిసినవారిలో ప్రభుత్వ విప్ ఆర్ కాంతారావు, ఎమ్మెల్యే ఆత్రం సకుతో పాటు పలువురు టీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు, సీనియర్ నాయకులు, ఆదివాసీ సంఘాల ప్రతినిధులు ఉన్నారు.