హైదరాబాద్, జనవరి 13 : సంక్రాంతి పండుగ సందర్భంగా ఎగురవేసే గాలిపటాలకు గాజుపూతతో కూడిన సింథటిక్, నైలాన్ మాంజాలు వినియోగించొద్దని అటవీశాఖ ప్రకటించింది. వాటిపై విధించిన నిషేధం కొనసాగుతున్నదని గురువారం ఓ ప్రకటనలో పేర్కొన్నది. రాష్ట్ర ప్రభుత్వం సింథటిక్, నైలాన్ మాంజాలను నిషేధిస్తూ 2016లో ఉత్తర్వులు జారీచేసిన విషయం తెలిసిందే. ప్రస్తుతం జంటనగరాలు, చుట్టపక్కల జిల్లాల్లో తనిఖీలకు అటవీశాఖ మొబైల్ టీంలను ఏర్పాటు చేసింది. ప్రజలకు, దుకాణాదారులకు అవగాహన కల్పిస్తున్నది. తెలుగు, హిందీ, ఇంగ్లిష్ భాషల్లో పోస్టర్లను ముద్రించి, దుకాణాలలో అంటించింది. పోలీసుశాఖ, జీహెచ్ఎంసీ అధికారులు, స్వచ్ఛంద సంస్థలు కూడా నిషేధాజ్ఞలను అమలు చేయాలని అటవీశాఖ సూచించింది. ఎక్కడైనా సింథటిక్, నైలాన్ మాంజాల అమ్మకాలు, కొనుగోళ్లు జరిగితే అటవీశాఖ టోల్ఫ్రీ నంబర్ 18004255364 లేదా 040-23231440 నంబర్లకు సమాచారం అందించాలని ఆ శాఖ కోరింది.