అమీర్పేట్, డిసెంబర్ 5 : ఆ రోడ్డుకిరువైపులా ప్రధాన దవాఖానలు, నివాసిత ప్రాంతాలే కాకుండా వ్యాపార, వాణిజ్య కేంద్రాలు ఉన్నాయి. నిత్యం వాహనాలు దూసుకుపోతుండే ఈ రోడ్డు మీద పాదచారులు నడిచేందుకు కూడా భయపడుతుండేవారు. అలాంటిది రోడ్డు దాటాల్సిన పరిస్థితే వస్తే.. ఇక చెప్పాల్సిన పని లేదు. ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని రోడ్డు దాటుతూ పదుల సంఖ్యలో పాదచారులు మృత్యువాత పడ్డ ఉదంతాలు ఎన్నో ఉన్నాయి. దీంతో ఫుట్ఓవర్ బ్రిడ్జి నిర్మాణాలకు జీహెచ్ఎంసీ శ్రీకారం చుట్టింది.
ముంబై జాతీయ రహదారిపై ఉన్న ఈ ప్రదేశంలో సనత్నగర్ ఈఎస్ఐ సూపర్ స్పెషాలిటీ దవాఖాన, సనత్నగర్ ఈఎస్ఐసీ వైద్య కళాశాల, కేంద్రీయ యునాని పరిశోధన సంస్థ, ప్రభుత్వ ఛాతి వ్యాధుల వైద్యశాల, మానసిక చికిత్సాలయం, ప్రభుత్వ ఆయుర్వేద దవాఖాన, వైద్య కళాశాల, ఎర్రగడ్డ రైతుబజార్ వంటి ప్రతిష్టాత్మక సంస్థలతో పాటు వ్యాపార, వాణిజ్య కేంద్రాలే కాక రోడ్డు కిరువైపులా వేదిగా బహుళ అంతస్తుల నిర్మాణాలు ఉన్నాయి.
సనత్నగర్ ఈఎస్ఐ సమీపంలో నిర్వహిస్తున్న ఫుట్ ఓవర్ బ్రిడ్జి నిర్మాణ పనులు తుది దశకు చేరుకున్నాయి. ఈ నిర్మాణాలు డిసెంబర్ రెండో వారంలో ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నామని జీహెచ్ఎంసీ యూసుఫ్గూడ ఈఈ రాజ్కుమార్ వెల్లడించారు. రూ.3.85 కోట్ల వ్యయంతో 34.4 మీటర్ల కాలినడక మార్గంతో ఈ బ్రిడ్జి రూపుదిద్దుకుందని తెలిపారు. ఈ ఫుట్ ఓవర్ బ్రిడ్జి చక్కటి మెటల్ రూఫ్తో రూపుదిద్దుకుందని వివరించారు.