హైదరాబాద్, డిసెంబర్ 7 (నమస్తే తెలంగాణ): నరంలేని నాలుక 40 రకాలుగా మాట్లాడినట్టు.. పంటల మార్పిడిపై కేంద్ర ప్రభుత్వం పూటకో మాట మాట్లాడుతున్నది. ‘నవ్విపోదురు గాక నాకేటి సిగ్గు’ అన్నట్టుగా రైతుల జీవితాలతో చెలగాటమాడుతున్నది. వరికి బదులు ఇతర పంటలు సాగుచేసేలా రైతులను ప్రోత్సహించాలని మొన్నటివరకూ చిలక పలుకులు పలికి.. ఇప్పుడు నాలుక మడతేసింది. నిండు పార్లమెంట్లో అబద్ధాలను వల్లే వేసింది. మంగళవారం లోక్సభలో కాంగ్రెస్ ఎంపీ ఉత్తమ్కుమార్రెడ్డి అడిగిన ప్రశ్నకు కేంద్ర వ్యవసాయశాఖ మంత్రి నరేంద్రసింగ్ తోమర్ సమాధానమిస్తూ.. తెలంగాణలో పంటల సా గుపై ఎలాంటి షరతులు పెట్టలేదని చెప్పారు. ప్రస్తుత యాసంగి సీజన్లో తెలంగాణ నుంచి బాయిల్డ్ రైస్ కొనుగోలు చేసేదే లేదని ఇప్పటికే తేల్చిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగానే రైతులను ఇతర పంటలవైపు మళ్లించాలని సూచిస్తూ సెప్టెంబర్ 8న ఎఫ్సీఐ తెలంగాణ ప్రభుత్వానికి లేఖ రాసింది. ‘ఇతర పంటలవైపు మళ్లించండి’ అంటే వరిసాగు వద్దనే కదా అర్థం. ఇప్పుడు దీనికి కేంద్రం వక్రభాష్యాలు చెప్తున్నది. తెలంగాణలో పంటల సాగుపై ఎలాంటి షరతులు పెట్టలేదని చెప్పడంపై విస్మయం వ్యక్తమవుతున్నది. ఇప్పటివరకూ ఏ అంశాన్నీ స్పష్టంగా చెప్పిన పాపానపోని కేంద్ర ప్రభుత్వం ధాన్యం కొనుగోళ్ల విషయంలోనూ నాలుక మడతేయడంపై అడుగడుగునా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ధాన్యం కొనలేమని ఓసారి.. మేం కొనబోమని చెప్పినమా అని మరోసారి.. ఇతర పంటలు సాగు చేయాలని ఓసారి.. అంతలోనే మళ్లీ వరి వద్దని మేం చెప్పినమా అంటూ మరోసారి కేంద్రం కుప్పిగంతులు వేయడంపై ఆగ్రహం వ్యక్తమవుతున్నది.