కొట్టాయం, అక్టోబర్ 17: రెండు రోజులుగా ఎడతెరిపి లేకుండా కురిసిన భారీ వర్షాలు కేరళలో పెను బీభత్సం సృష్టించాయి. వరదలు, కొండచరియలు విరిగిపడి 22 మంది చనిపోయారు. ఇడుక్కి, కొట్టాయం జిల్లాల్లో భారీగా ఆస్తి, ప్రాణ నష్టం సంభవించింది. కొట్టాయంలో 13 మంది చనిపోగా, ఇడుక్కిలో 9 మంది మృతి చెందారు. ఆదివారం ఉదయానికి వర్షం కొంత తగ్గుముఖం పట్టినప్పటికీ.. ఇంకా వర్షాలు కురిసే అవకాశం ఉందన్న ఐఎండీ సూచనలతో అధికారులు సహాయ కార్యక్రమాలు కొనసాగిస్తున్నారు. ఐఎండీ రాష్ట్రంలోని ఆరు జిల్లాలకు రెడ్ అలర్డ్ జారీచేసింది. ఆదివారం కూడా తిరువనంతపురం, పథనంతిట్ట, కొట్టాయం తదితర జిల్లాల్లో వర్షం కురిసింది. కొండచరియల కింద మట్టిలో చిక్కుకుపోయిన 19 మంది మృతదేహాలను ఆదివారం వెలికితీశారు. శనివారం మూడు మృతదేహాలను స్వాధీనం చేసుకొన్నారు. గల్లంతైన మరో ఇద్దరి కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. సహాయ కార్యక్రమాల కోసం సైన్యం రంగంలోకి దిగింది. వరద బాధితుల కోసం ప్రభుత్వం 105 రిలీఫ్ క్యాంపులు ఏర్పాటు చేసిందని, మరిన్ని ఏర్పాటు చేస్తామని కేరళ సీఎం విజయన్ తెలిపారు. మృతుల కుటుంబాలకు కేరళ ప్రభుత్వం రూ. 4 లక్షల చొప్పున ఎక్స్గ్రేషియా ప్రకటించింది. కేరళలో వరదల్లో 22 మంది చనిపోవడంపై ప్రధాని మోదీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.
ఒకే ఇంట్లో ఆరుగురు మృతి
ఆదివారం ఇడుక్కి జిల్లాలో మట్టి పెళ్లల కింద కూరుకుపోయిన ముగ్గురు పిల్లల మృతదేహాలను వెలికితీశారు. వారి వయస్సు 8 ఏండ్లు, 7 ఏండ్లు, నాలుగేండ్లు. ముగ్గురూ ఒకరి చేతులు ఒకరు పట్టుకొని చనిపోయిన స్థితిలో కనిపించడం హృదయాలను ద్రవింపజేసింది. కొట్టాయంలోని కూట్టిక్కల్లో ఒకే ఇంట్లో ఆరుగురు చనిపోయారు. అందులో ముగ్గురు పిల్లలు. వారి ఇల్లు వరద ప్రవాహంలో కొండచరియలతో పాటు కొట్టుకుపోయింది. వీరిలో ముగ్గురి మృతదేహాలను శనివారమే స్వాధీనం చేసుకోగా.. ఆదివారం మరో మగ్గురివి లభించాయి.