హైదరాబాద్, మార్చి18 (నమస్తే తెలంగాణ): టీఆర్ఎస్ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన మొదటి రోజే సాగునీటి రంగాన్ని అత్యంత ప్రాధాన్య అంశంగా ప్రకటించిం ది. మిషన్ కాకతీయ వంటి పథకాలు కాళేశ్వరం, పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల వంటి భారీ ప్రాజెక్టులు చేపట్టింది. అదేస్థాయిలో నిధులు కేటాయిస్తున్నది. గత ఆరేండ్లుగా బడ్జెట్లో నీటిపారుదలశాఖకు పెద్దపీట వేస్తున్నది. సంక్షేమం, ఇతరరంగాలకు ప్రాధాన్యమిస్తూనే.. సాగునీటి ప్రాజెక్టులు వేగంగా పూర్తిచేసేలా నిధులు విడుదల చేస్తున్నది. బడ్జెట్లో నిధులు కేటాయించడంతోపాటు అవసరమైతే రుణాలు సమీకరించి గడువులోగా ప్రాజెక్టులు పూర్తి చేయాలని ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉన్నది. తాజా బడ్జెట్లోనూ సాగునీటి రంగానికి రూ.16,931కోట్లు కేటాయించింది. ఇం దులో నిర్వహణపద్దు రూ.10,507 కోట్లు కాగా, ప్రగతి పద్దు రూ.6,424 కోట్లుగా చూపింది. గతేడాది కేటాయింపులతో పో ల్చితే ఈసారి 50శాతం వరకు పెరుగడం గమనార్హం.
తెలంగాణను కోటిన్నర ఎకరాల మాగాణంగా మార్చాలన్న సీఎం కేసీఆర్ సంకల్పం మేరకు రాష్ట్రవ్యాప్తంగా భారీస్థాయిలో ప్రాజెక్టులు, ఎత్తిపోతల పథకాలు చేపట్టిన సంగతి తెలిసిందే. ఇప్పటికే కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభం కాగా, ఈసారి పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకంపై ప్రధానంగా దృష్టిపెట్టింది. డిండి ప్రా జెక్టును వేగంగా పూర్తి చేసేందుకు ఏకంగా రూ.545 కోట్లు, ఎస్ఎల్బీసీకి రూ.331 కోట్లు వెచ్చించనున్నట్టు తెలిపింది. దీంతోపాటు సీతారామ, డిండి, లోయర్ పెన్గంగ, ఎలిమినేటి మాధవరెడ్డి, నెట్టెంపాడు, కల్వకుర్తి, భీమా తదితర ప్రాజెక్టులపైనా ప్రభుత్వం దృష్టిపెట్టింది. ఆయా ప్రాజెక్టులను వేగంగా పూర్తి చేసేందుకు భారీగా నిధులు కేటాయించినట్టు వెల్లడించింది. ఇటీవలే ముఖ్యమంత్రి కేసీఆర్ ఉమ్మడి నల్గొండ జిల్లాలో 13 ఎత్తిపోతల పథకాలకు ఒకేసారి శంకుస్థాపన చేసిన సంగతి తెలిసిందే. ప్రభుత్వం వీటికి ప్రత్యేకంగా రూ.2,395 కోట్లు విడుదల చేస్తూ అప్పట్లోనే ఉత్తర్వులు జారీ చేసింది.
‘మిషన్ కాకతీయ ఒక సక్సెస్స్టోరీ’ అని గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే సందర్భంగా సీఎం కేసీఆర్ పేర్కొన్నారు. ఈ పథకం కింద చెరువులను బాగుచేయడంతో నీటినిలకు అవకాశమేర్పడింది. భూగర్భ జలాలు పెరిగాయి. మిషన్ కాకతీయ కింద 99 శాతం చెరువుల పునరుద్ధరణ పూర్తయింది. మిగతా పెండింగ్ పను లు పూర్తి చేయడంతోపాటు చెరువుల నిర్వహణకు మిషన్కాకతీయకు రూ.751 కోట్లు కేటాయించింది. టీఎస్ఐడీసీకి రూ.252. 98 కోట్లు, గోదావరి, కృష్ణా నదీ యాజమాన్య బోర్డుల నిర్వహణకు రూ.13 కోట్లు కేటాయించింది. ఈ ఏడాది మొత్తంగా నీటిపారుదల రంగంలో రూ.30 వేల కోట్ల వరకు వెచ్చించాలని ప్రభుత్వం భావిస్తున్నట్టు సమాచారం. బడ్జెట్లో దాదాపు రూ.17వేల కోట్లు కేటాయించగా.. మరో రూ.13 వేల కోట్ల వరకు రుణాలు సమీకరించే అవకాశం ఉన్నది.