మంగుళూరు: మంగుళూరు నుంచి ముంబై వెళ్లాల్సిన విమానం ఆదివారం ఆరు గంటలు ఆలస్యంగా వెళ్లింది. ఓ అనుమానాస్పద మెసేజ్ గురించి మహిళా ప్రయాణికురాలు విమాన సిబ్బందిని అప్రమత్తం చేయడంతో ఆ విమానాన్ని కొన్ని గంటల పాటు ఆపేశారు. తన పక్కన కూర్చున్న ప్రయాణికుడికి వచ్చిన మెసేజ్ గురించి ఆ మహిళా ప్రయాణికురాలు ఆందోళన వ్యక్తం చేసింది. దీంతో క్యాబిన్ సిబ్బంది ఆ విమానంలో ఉన్న ప్రయాణికుల్ని దించేశారు. విమానాన్ని క్షుణ్ణంగా తనిఖీ చేసిన తర్వాత మళ్లీ ప్రయాణికుల్ని అనుమతించారు. లగేజీని కూడా చెక్ చేశారు. దాడి జరిగే ఛాన్సు ఉందంటూ వచ్చిన మెసేజ్తో విమాన సిబ్బంది అప్రమత్తమైంది. ముంబై వెళ్లాల్సిన ఇండిగో విమానంలో ఈ ఘటన చోటుచేసుకున్నది. టేకాఫ్ తీసుకునే సమయంలో జరిగిన ఈ పరిణామంతో విమాన ప్రయాణం ఆరు గంటలు ఆలస్యమైంది. పూర్తిగా చెకింగ్ అయిన తర్వాత185 మంది ప్రయాణికుల్ని మళ్లీ ముంబై విమానం ఎక్కించారు.