రాయికల్ రూరల్, ఫిబ్రవరి 18: ఆధునిక యుగంలోనూ మంత్రాలపై ప్రజల్లో మూఢ నమ్మకాలు తొలగట్లేదు. ‘మంత్రాలు చేస్తూ అమాయకుల జీవితాలను సర్వనాశనం చేస్తున్నారంటూ’ జగిత్యాల జిల్లాలో వెలిసిన ఫ్లెక్సీలే ఇందుకు తాజా నిదర్శనం. రాయికల్ మండలం జగన్నాథ్పూర్లో ‘8 మంది మాంత్రికులు తీరు మార్చుకోవాలని హెచ్చరిస్తూ ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలు తీవ్ర కలకలం రేపాయి. సమాచారం అందుకొన్న పోలీసులు అప్రమత్తమయ్యారు. శుక్రవారం ఉదయం డీఎస్పీ ప్రకాశ్ గ్రామానికి చేరుకొని వివరాలు సేకరించారు. గ్రామస్థులే ఉద్దేశపూర్వకంగా ఏర్పాటు చేశారా?, ఆకతాయిల పనా? అనే కోణంలో విచారణ చేపట్టారు. ఎస్పీ సింధూశర్మ ఆదేశాల మేరకు మూఢ నమ్మకాల నిర్మూలనపై గ్రామంలో అవగాహన కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తామని డీఎస్పీ చెప్పారు. సున్నితమైన అంశాలపై అతిగా స్పందించవద్దని విజ్ఞప్తిచేశారు.