న్యూఢిల్లీ, మార్చి 9: ఐదు రాష్ర్టాల అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపునకు సర్వం సిద్ధమైంది. గురువారం 690 అసెంబ్లీ స్థానాలకు 1,200 కౌంటింగ్ హాళ్లలో ఉదయం 8 గంటల నుంచి ఓట్ల లెక్కింపు ప్రారంభం కానున్నది. లెక్కింపులో 50వేల మంది సిబ్బంది పాలు పంచుకోనున్నారు. మొదట పోస్టల్ బ్యాలెట్లను లెక్కిస్తారు. కొవిడ్ నిబంధనల నడుమ ఓట్ల లెక్కింపు ఉంటుందని అన్ని రాష్ర్టాల ఎన్నికల సంఘాల అధికారులు చెప్పారు. అన్ని కౌంటింగ్ కేంద్రాల్లో వీడియో రికార్డింగ్ ఉంటుందన్నారు. ప్రతీ కౌంటింగ్ కేంద్రం దగ్గర మూడంచెల భద్రత వ్యవస్థను ఏర్పాటు చేస్తున్నట్టు వెల్లడించారు. ఒక్క యూపీలోనే 250 కంపెనీల సీఏపీఎఫ్ బలగాలు భద్రతా విధుల్లో పాల్గొంటాయి. పంజాబ్లో 45 కంపెనీల బలగాలను మోహరించినట్టు అధికారులు తెలిపారు. పంజాబ్లో కౌంటింగ్ సెంటర్ల దగ్గర కర్ఫ్యూ అమల్లో ఉంటుందని రాష్ట్ర చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ కరుణ రాజు చెప్పారు. గెలుపు సంబురాలపై నిషేధం ఉందన్నారు. ఇక్కడ గురువారాన్ని డ్రై డే(మద్యం అమ్మకాలపై నిషేధం)గా ప్రకటించారు. ఐదు రాష్ర్టాల్లో ఫిబ్రవరి 10 నుంచి మార్చి 7 మధ్య ఏడు దశల్లో ఎన్నికలు పూర్తయ్యాయి. ఎగ్జిట్ పోల్స్ అంచనాలను బట్టి ఉత్తరప్రదేశ్, మణిపూర్ రాష్ర్టాల్లో బీజేపీ అధికారంలోకి రానున్నది. ఉత్తరాఖండ్, గోవాలో కాంగ్రెస్, బీజేపీ మధ్య హోరాహోరీ ఉన్నది. పంజాబ్లో ఆప్ అధికారంలోకి వస్తుందని సర్వే సంస్థలన్నీ వెల్లడించాయి. ఇదిలా ఉండగా, కౌంటింగ్ నేపథ్యంలో అన్ని రాజకీయ పార్టీలు తమ కీలక నేతలను కౌంటింగ్ జరిగే రాష్ర్టాలకు పంపిస్తున్నాయి. ఇంచార్జులను నియమించాయి.
ముగ్గురు అధికారులపై ఈసీ సస్పెన్షన్ వేటు
యూపీలో బీజేపీ ఈవీఎంల ట్యాంపరింగ్కు పాల్పడుతున్నదని సమాజ్వాదీ పార్టీ (ఎస్పీ) చీఫ్ అఖిలేశ్ యాదవ్ ఆరోపించారు. స్ట్రాంగ్రూంల దగ్గర తమ కార్యకర్తలను అప్రమత్తం చేసినట్టు చెప్పారు. అన్ని కేంద్రాల్లో కౌంటింగ్ ప్రక్రియ వీడియో రికార్డింగ్ లింక్ను రాజకీయ పార్టీలకు ఇవ్వాలని, ప్రత్యక్షంగా చూసే అవకాశం కల్పించాలని అఖిలేశ్ యాదవ్ ఎన్నికల సంఘానికి లేఖ రాశారు. ఇదిలా ఉండగా ట్రక్కులో ఈవీఎంల తరలింపుపై ఎన్నికల సంఘం వివరణ ఇచ్చింది. ‘అవి శిక్షణ కోసం ఉపయోగించినవి. వాటిని ఎన్నికల్లో వాడలేదు’ అని స్పష్టం చేసింది. కానీ ఈ వ్యవహారంలో వారణాసి ఈవీఎంల నోడల్ అధికారి సహా ముగ్గురు అధికారులను సస్పెండ్ చేసింది. రాయ్బరేలీలో చెత్త కుప్పల్లో బ్యాలెట్లు కనిపించిన అంశంలో కూడా ఎన్నికల అధికారులను ఈసీ సస్పెండ్ చేసింది.
రిసార్టుకు కాంగ్రెస్ అభ్యర్థులు
గోవాలో 2017లో చేసిన తప్పిదాన్ని పునరావృతం చేయవద్దని కాంగ్రెస్ భావిస్తున్నది. ముందు జాగ్రత్తగా ఆ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థులందరినీ రిసార్టుకు తరలించింది. 40 స్థానాలున్న గోవాలో 2017లో కాంగ్రెస్కు అత్యధికంగా 17 సీట్లు వచ్చాయి. బీజేపీకి 13 వచ్చాయి. కానీ అధికారాన్ని చేజిక్కించుకోవడంలో కాంగ్రెస్ విఫలమైంది. ఎమ్మెల్యేలను లాక్కోవడం, స్వతంత్రులు, స్థానిక పార్టీల మద్దతుతో బీజేపీ అధికారం చేపట్టింది.