సుల్తాన్బజార్, జనవరి 22: ఎన్నో ఏండ్ల చరిత్ర కలిగిన బేగంబజార్ చేపల మార్కెట్ అధునాతన సౌకర్యాలతో నిర్మాణం పూర్తి చేసుకొని ప్రారంభానికి సిద్ధంగా ఉందని రాష్ట్ర పశు సంవర్ధక శాఖ, మత్య్స, పాడి పరిశ్రమల అభివృద్ధి శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ పేర్కొన్నారు. ఈ మేరకు శనివారం ఆయన ఎమ్మెల్యే రాజాసింగ్, జీహెచ్ఎంసీ కమిషనర్ లోకేశ్కుమార్, మత్య్స శాఖ కమిషనర్ భూక్యా నాయక్, గోషామహల్ టీఆర్ఎస్ ఇన్చార్జి ప్రేమ్సింగ్ రాథోడ్, టీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు నందకిశోర్వ్యాస్తో పాటు వివిధ శాఖల అధికారులతో కలిసి నూతన మోడల్ ఫిష్ మార్కెట్ భవనాన్ని సందర్శించి పరిశీలించారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. 114 యేండ్ల చరిత్ర కలిగిన ఈ మార్కెట్లో ఎటువంటి సౌకర్యాలు, వసతులు లేక వ్యాపారులు, ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారని అన్నారు. అన్ని వసతులతో అత్యాధునిక పద్ధతిలో నూతన ఫిష్ మార్కెట్ భవనాన్ని నిర్మించాలన్నదే.. సీఎం కేసీఆర్ కల అని తెలిపారు. సీఎం ఆదేశాల మేరకు రూ.9.50 కోట్లతో జీ ప్లస్ 2 పద్ధతిలో ఫిష్ హోల్సేల్, రిటైల్ మార్కెట్ భవనాన్ని నిర్మించామన్నారు. మొదటి అంతస్థులో కటింగ్ సెక్షన్, ఫిష్ రిటైల్ మార్కెట్, రెండో అంతస్థులో డ్రై ఫిష్ విక్రయాలు జరుగుతాయని చెప్పారు. క్యాంటీన్ను కూడా ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. కాగా భవన నిర్మాణంలో మిగిలిపోయిన పనులను త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.
నూతన మార్కెట్ భవనానికి కాంపౌండ్ వాల్ నిర్మాణం చేపట్టేందుకు ప్రతి పాదనలను సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. అంతేకాకుండా తాగునీరు, సీవరేజీ పైపులైన్ల కోసం రూ.33 లక్షలు ఖర్చవుతాయని అధికారులు మంత్రికి తెలుపగా, వెంటనే నిధులు మంజూరు చేసి పనులను చేపట్టాలని జీహెచ్ఎంసీ కమిషనర్ లోకేశ్కుమార్ను మంత్రి ఆదేశించారు. ఈ మార్కెట్లో చేపలు విక్రయించుకుంటున్న వారికి మాత్రమే జీహెచ్ఎంసీ ఆధ్వర్యంలో వ్యాపారి ఫొటోతో కూడిన లైసెన్సులను జారీ చేయడం జరుగుతుందని తెలిపారు.
నూతన మార్కెట్ చుట్టూ ఉన్న ఆక్రమణలను తొలగించేందుకు చర్యలు తీసుకోవాలని టౌన్ ప్లానింగ్ అధికారులను ఆదేశించారు. స్థానికంగా డ్రైనేజీ దుర్గంధం వెదజల్లడంతో సీవరేజీ పైప్లైన్ కోసం రూ.12 లక్షలు మంజూరు చేస్తున్నట్లు ప్రకటించడంతో స్థానిక వ్యాపారులు హర్షం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో బేగంబజార్ కార్పొరేటర్ శంకర్ యాదవ్, మాజీ కార్పొరేటర్లు పరమేశ్వరీ సింగ్, ముఖేష్ సింగ్, టీఆర్ఎస్ నాయకులు ఆర్వీ మహేందర్, ఎం.ఆనంద్కుమార్ గౌడ్, ఆనంద్ సింగ్లోథ్, ప్రియాగుప్తా, వాటర్ వర్క్స్ ఈఎన్సీ కృష్ణ, సీఈ దేవానంద్, ఈఈ సురేశ్, ఎలక్ట్రికల్ డీఈ నెహ్రూనాయక్, తదితరులు పాల్గొన్నారు.