హైదరాబాద్, అక్టోబర్ 30 (నమస్తే తెలంగాణ): సుప్రియో ఓ హోటల్ మేనేజ్మెంట్ స్కూల్లో లెక్చరర్. అభయ్ సాఫ్ట్వేర్ ఇంజినీర్. ఎనిమిదేండ్ల క్రితం ఇద్దరికి ఓ డేటింగ్ యాప్లో పరిచయమైంది. పరిచయం స్నేహంగా.. స్నేహం ప్రేమగా మారింది. ఇద్దరు కొంతకాలం సహజీవనం చేశారు. ఒకరినొకరు అర్థం చేసుకొన్నారు. వివాహం చేసుకోవడానికి సిద్ధమయ్యారు. డిసెంబర్లో పెండ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. సుప్రియో, అభయ్ ఇద్దరూ పురుషులే కావడం ఇక్కడ విశేషం. తెలంగాణలో ఇద్దరు స్వలింగ సంపర్కుల(గే)కు జరిగే మొట్టమొదటి వివాహం వీరిదే. పెండ్లికి తమ ఇద్దరి తల్లిదండ్రులు ఒప్పుకొన్నట్టు సుప్రియో, అభయ్ చెప్పారు. షాపింగ్ కూడా ప్రారంభమైందని, సంప్రదాయబద్ధంగా బహిరంగంగా పెండ్లి చేసుకోనున్నట్టు వెల్లడించారు. మంగళస్నానాలు, ఉంగరాలు మార్చుకోవడం వంటి కార్యక్రమాలు కూడా ఉంటాయని తెలిపారు. ‘బడిలో నన్నెంతో వేధించేవారు. ఎంతో ఏడ్చాను. బాధతో నిద్రపట్టేది కాదు’ అని సుప్రియో ఈ సందర్భంగా చెప్పాడు. 2014లో స్వలింగ సంపర్కులతో నిర్వహించిన హైదరాబాద్ ప్రైడ్ వాక్ తన జీవితాన్ని మార్చినట్టు వెల్లడించాడు. అప్పుడు మీడియాలో కనిపించడంతో తన గురించి అందరికీ తొలిసారి తెలిసిందని తెలిపాడు.