ఏటూరునాగారం, నవంబర్ 21: పట్టుదలతో చదువులో రాణిస్తున్న చదువుల తల్లికి ఉన్నత విద్యాభ్యాసానికి ఆర్థిక ఇబ్బందులు అడ్డంకిగా మారాయి. ములుగు జిల్లా కన్నాయిగూడెం మండలం కంతనపల్లికి చెందిన దబ్బగట్ల గంగాదేవి-నాగేశ్వర్రావుల కుమార్తె సమ్మ క్క ఈ ఏడాది జేఈఈ మెయిన్స్లో మంచి ర్యాంకు సాధించింది. ఇంజినీరింగ్లో అడ్మిషన్ పొందేందుకు ఆర్థిక ఇబ్బందులు ఎదురయ్యా యి. వివరాల్లోకి వెళ్తే.. సమ్మక్క గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలోనే మూడోతరగతి వరకు చదివింది. నాలుగోతరగతి నుంచి పది వరకు కన్నాయిగూడెం గిరిజన ఆశ్రమ పాఠశాలలో చదువుకొన్నది. ఏటూరునాగారంలోని గిరిజన గురుకుల బాలికల కళాశాలలో ఇంటర్ పూర్తిచేసింది.
గతేడాది కరోనాతో కళాశాలలు బంద్ ఉన్నప్పటికీ.. ఇంటి వద్దనే ఉండి జేఈఈ మెయిన్స్కు సిద్ధమైంది. ఇటీవల విడుదలైన ఫలితాల్లో సమ్మక్కకు 4,165 ర్యాంకు వచ్చింది. ఎన్ఐటీ రాయపూర్లో సీటు దక్కింది. ఈ నెల 24లోగా అడ్మిషన్ పొందాల్సి ఉండగా తల్లిదండ్రులకు ఆర్థిక స్థోమత లేకపోవడంతో చదువు మధ్యంతరంగా ఆగిపోతుందని ఆవేదన చెందుతున్నది. ఎకరం భూమిలో వ్యవసాయం చేసుకొని బతికే నాగేశ్వర్రావు దంపతులు.. రాయ్పూర్లో కూతురికి సీటు వచ్చినా అడ్మిషన్ ఇప్పించలేకపోతున్నామని బాధపడ్తున్నారు. సమ్మక్క అడ్మిషన్కు సాయం చేయాలని దాతలకు విజ్ఞప్తి చేస్తున్నారు.