సహజంగానే గవర్నర్లకు, రాజ్యాంగబద్ధ సంస్థలకు అత్యంత విలువ, గౌరవం ఇచ్చే ముఖ్యమంత్రి కేసీఆర్తో గవర్నర్ తమిళిసైకి ఎకడ తేడా వచ్చిందనే దానిపై చర్చలు మొదలయ్యాయి. రాష్ట్ర గవర్నర్గా వచ్చిన తమిళిసైకి రాష్ట్ర ప్రభుత్వం అన్ని రకాలుగా సహకరించింది. పూర్తి విలువ ఇచ్చింది. ముఖ్యమంత్రి కేసీఆర్ పదుల సందర్భాల్లో గవర్నర్ నివాసానికి వెళ్లి ఆమెతో సమావేశమయ్యారు. ప్రొటోకాల్ సహా ఏ విషయంలోనూ గవర్నర్కు ఎలాంటి లోటూ రాకుండా చూశారు. పూర్తిగా సహకారాత్మక ధోరణి ప్రదర్శించిన రాష్ట్ర ప్రభుత్వంతో గవర్నర్ హఠాత్తుగా కయ్యం పెట్టుకోవడంలో ఆంతర్యం అర్థంకావడం లేదని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
హైదరాబాద్, మార్చి 5 (నమస్తే తెలంగాణ): వచ్చే ఆర్థిక సంవత్సరపు బడ్జెట్ను అసెంబ్లీలో ప్రవేశపెట్టేందుకు అవసరమైన ఆర్థిక బిల్లుకు రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందర్రాజన్ సిఫారసు చేశారు. రాజ్యాంగం నిబంధనల మేరకు ఆర్థిక బిల్లుకు గవర్నర్ సిఫారసు తప్పనిసరి. ఈ నేపథ్యంలో శనివారం బిల్లుకు సిఫారసు చేస్తూనే, గవర్నర్ సుదీర్ఘ పత్రికా ప్రకటన విడుదల చేయడం రాజ్యాంగ నిపుణుల్లో చర్చకు దారితీసింది. రాజ్యాంగ సంప్రదాయాలను గౌరవిస్తూ, రాజకీయ పరిణామాలకు అతీతంగా, సహకార సమాఖ్య స్ఫూర్తిని కొనసాగిస్తూ, ఆర్థిక బిల్లును ప్రవేశపెట్టడానికి తన సిఫారసును తెలియజేశానని తమిళిసై తన ప్రకటనలో పేర్కొన్నారు.
ఆర్థిక బిల్లు విషయంలో తనకున్న స్వేచ్ఛకు అనుగుణంగా జాప్యం చేయవచ్చని, కానీ ప్రజాసంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకొని తాను ఆ పని చేయటం లేదని ఆమె అన్యాపదేశ వ్యాఖ్యలు చేశారు. గత అసెంబ్లీ సమావేశాలు ప్రొరోగ్ కాకుండా, కొనసాగింపులోనే ఉన్నందున, రాజ్యాంగ నిబంధనల ప్రకారం ఈసారి బడ్జెట్ సమావేశాల ఆరంభంలో గవర్నర్ ప్రసంగం అవసరం లేదని ప్రభుత్వం భావించిన సంగతి తెలిసిందే. ఈ క్యాలెండర్ ఇయర్లో ఇది కొత్త సెషన్ కానందున గవర్నర్ ప్రసంగం అవసరం లేదని, గతంలోనూ అనేకసార్లు ఇలాగే జరిగిందని పలువురు రాజ్యాంగ నిపుణులు కూడా పేర్కొన్నారు.
అయితే ఈ నిర్ణయాన్ని ఆక్షేపించే రీతిలో గవర్నర్ పత్రికా ప్రకటన విడుదల చేయడం పట్ల రాజకీయ వర్గాలు విస్మయం వ్యక్తంచేస్తున్నాయి. ఈ బడ్జెట్ సెషన్లో గవర్నర్ ప్రసంగాన్ని నిర్వహించకపోవడం వల్ల, గత ఏడాదిలో ప్రభుత్వం పనితీరుపై చర్చించే అవకాశాన్ని సభ్యులు కోల్పోతున్నారని గవర్నర్ పేర్కొన్నారు. ఏది ఏమైనా తాను రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు చెప్తున్నట్టు ఆమె పేర్కొన్నారు. రాజ్యాంగం గవర్నర్కు కొన్ని అధికారాలు ఇచ్చినప్పటికీ, గవర్నర్ ప్రసంగం నిర్వహించకూడదని నిర్ణయించినప్పటికీ, తన ప్రాథమిక ఉద్దేశం ప్రజల సంక్షేమమని, ఈ కోణంలోనే తాను అసెంబ్లీలో బడ్జెట్ను సమర్పించటానికి తన ఆమోదం తెలిపినట్టు ఆమె ప్రకటించారు. సహజంగానే గవర్నర్లకు, రాజ్యాంగబద్ధ సంస్థలకు అత్యంత విలువ, గౌరవం ఇచ్చే ముఖ్యమంత్రి కేసీఆర్తో గవర్నర్ తమిళిసైకి ఎకడ తేడా వచ్చిందనే దానిపై చర్చలు మొదలయ్యాయి.
రాష్ట్ర గవర్నర్గా వచ్చిన తమిళిసైకి రాష్ట్ర ప్రభుత్వం అన్ని రకాలుగా సహకరించింది. పూర్తి విలువ ఇచ్చింది. ముఖ్యమంత్రి కేసీఆర్ పదుల సందర్భాల్లో గవర్నర్ నివాసానికి వెళ్లి ఆమెతో సమావేశమయ్యారు. ప్రొటోకాల్ సహా ఏ విషయంలోనూ గవర్నర్కు ఎలాంటి లోటూ రాకుండా చూశారు. పూర్తిగా సహకారాత్మక ధోరణి ప్రదర్శించిన రాష్ట్ర ప్రభుత్వంతో గవర్నర్ హఠాత్తుగా కయ్యం పెట్టుకోవడంలో ఆంతర్యం అర్థంకావడం లేదని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. రాజ్యాంగ బాధ్యతలను నిర్వర్తించే విషయంలోనూ, రాజ్యాంగ వ్యవస్థల విషయంలోనూ ముఖ్యమంత్రి కేసీఆర్ పూర్తి జాగరూకతతో, రాజకీయ అభిప్రాయభేదాలకు తావులేకుండా వ్యవహరిస్తారు. కేంద్ర, రాష్ర్టాల మధ్య జీ టు జీ సంబంధాల విషయంలో ఇది అనేకసార్లు రుజువైంది.
ఇక ఉమ్మడి రాష్ట్రంలో నరసింహన్ గవర్నర్గా ఉన్నపుడు, తెలంగాణ ఉద్యమం జరుగుతున్నపుడు కేసీఆర్తో పలు విషయాల్లో విభేదించారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటయ్యాక, కేసీఆర్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశాక కూడా ఆయనే గవర్నర్గా కొనసాగారు. అయినా ఇద్దరి మధ్య ఎంతో సఖ్యత ఉండేది. రాష్ట్రం ఏర్పడగానే, తొలుత అనేక రాజ్యాంగ పరమైన సంక్షోభాలు తప్పవని అందరూ భావించారు. కానీ, గవర్నర్ వ్యవస్థ రాష్ట్ర పాలనా యంత్రాంగానికి, ముఖ్యమంత్రి కేసీఆర్కు ఇవ్వాల్సిన గౌరవం ఇచ్చింది. కేసీఆర్ కూడా గవర్నర్ వ్యవస్థకు తగిన గౌరవం ఇచ్చారు. రెండు వ్యవస్థల మధ్య ఇచ్చిపుచ్చుకునే ధోరణి ఉండేది. కానీ, గవర్నర్గా తమిళిసై సౌందర్రాజన్ వచ్చిన తర్వాత అది తగ్గిందని విశ్లేషకులు చెప్తున్నారు.
బడ్జెట్ సమావేశాల్లో గవర్నర్ ప్రసంగం ఉండాలా వద్దా అన్న అంశంపై, రాజ్యాంగ నిబంధనలను అనుసరించి, ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందని, గవర్నర్ దీన్ని ఎలా తప్పుపడతారని వారు ప్రశ్నిస్తున్నారు. రాష్త్రంలో ప్రభుత్వ పాలన గవర్నర్ పేరుతోనే సాగుతుందనీ, అలాంటిది గవర్నర్ తన ప్రభుత్వానికి వ్యతిరేకంగా, తానే బహిరంగంగా ప్రెస్నోట్ ఎలా విడుదల చేస్తారని న్యాయనిపుణులు విస్మయం వ్యక్తంచేస్తున్నారు. అసలు అంత అవసరం ఏమొచ్చింది? ఇది ఏ రకం రాజ్యాంగ బాధ్యత? అని వారు ప్రశ్నిస్తున్నారు. బడ్జెట్ సమావేశాల్లో గవర్నర్ ప్రసంగం, ఆర్థిక బిల్లుకు గవర్నర్ సిఫారసు చేయడం అనేవి రెండు వేర్వేరు అంశాలనీ, రెంటి విషయంలోనూ రాజ్యాంగంలో స్పష్టమైన నిబంధనలున్నాయని, కానీ గవర్నర్ రెంటినీ కలగలిపి లేని సమస్యను లేవనెత్తే ప్రయత్నం చేశారని విశ్లేషకులు పేర్కొంటున్నారు. గవర్నర్ ప్రసంగం లేకపోవడం వల్ల గత ఏడాది ప్రభుత్వం పనితీరుపై చర్చ జరిగే అవకాశాన్ని సభ్యులు కోల్పోతున్నారన్నది కూడా సరికాదని వారు పేర్కొంటున్నారు.
అసెంబ్లీలో సభ్యులకు ఎప్పుడైనా, ఏ అంశంపై అయినా మాట్లాడే హక్కు ఉంటుందనీ, పద్దులపై చర్చతో సహా అనేక రూపాల్లో వారు వాటిని లేవనెత్తవచ్చనీ, అలాంటప్పుడు నిరుటిపై చర్చను నిరాకరించారన్న ప్రసక్తి ఎక్కడిదని వారు ప్రశ్నిస్తున్నారు. కాగా తమిళనాడు బీజేపీ రాష్ట్ర శాఖ అధ్యక్షురాలిగా పనిచేసిన తమిళిసై.. గవర్నర్గా తెలంగాణకు వచ్చినప్పటికీ తన పాత వాసనలు పోగొట్టుకోలేదన్న వాదనలు టీఆర్ఎస్ వర్గాల నుంచి వినిపిస్తున్నాయి. ఇంతకుముందు కూడా కొన్ని సందర్భాల్లో కూడా గవర్నర్ తమిళిసై రాష్ట్ర ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టేలా వ్యవహరించారని మీడియాలో కూడా చర్చకు వచ్చింది. తాజా పరిణామంతో గవర్నర్ ఉద్దేశపూర్వకంగా తెలంగాణ ప్రభుత్వం కాళ్లలో కట్టేపెట్టే ప్రయత్నం చేస్తున్నారన్న చర్చ మొదలైంది.
గవర్నర్ ఉద్దేశపూర్వకంగా తెలంగాణ ప్రభుత్వ కాళ్లలో కట్టెపెట్టే ప్రయత్నం చేస్తున్నారన్న చర్చ మొదలైంది. గవర్నర్, రాష్ట్ర ప్రభుత్వానికి మధ్య దూరం పెరగడానికి ప్రముఖ రాజకీయ విశ్లేషకులు కొన్ని కారణాలను ప్రముఖంగా చెప్తున్నారు. వాటిలో కొన్ని..
1. కౌశిక్రెడ్డిని గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీగా నామినేట్చేయాలని రాష్ట్ర మంత్రివర్గం సిఫారసు చేసింది. ఈ సిఫారసును గవర్నర్ ఆమోదించలేదు.. అలా అని తిరస్కరించనూ లేదు. చాలాకాలం తన దగ్గరే పెట్టుకున్నారు. ప్రభుత్వవర్గాలు కౌశిక్రెడ్డి అభ్యర్ధిత్వాన్ని ఆమోదించాలని కోరినపుడు.. కౌశిక్రెడ్డిపై కేసులున్నాయని గవర్నర్ కార్యాలయం సమాచారం ఇచ్చినట్టు ప్రచారం జరిగింది. ఒకవేళ అలా భావించినపుడు కౌశిక్రెడ్డి అభ్యర్ధిత్వాన్ని తిరస్కరించే అధికారం గవర్నర్కు ఉన్నది.. కానీ ఆమె నిర్ణయం తీసుకోలేదు. కేసులున్నాయి సరే.. కన్విక్షన్ (శిక్ష ) పడలేదని ప్రభుత్వవర్గాలు గవర్నర్కు వివరించినప్పటికీ పట్టించుకోలేదన్న వాదన ఉన్నది. ప్రభుత్వం మాటకు విలువ ఇవ్వలేదు. ఎవరైనా శిక్ష పడినప్పుడు మాత్రమే అనర్హుడవుతారు కానీ.. గవర్నర్ ఉద్దేశపూర్వకంగా రాష్ట్ర ప్రభుత్వ సిఫారసును తొకిపెట్టారన్న అభిప్రాయం రాజకీయ వర్గాల్లో ఉన్నది. ఈ నేపథ్యంలోనే చివరకు ముఖ్యమంత్రి కేసీఆర్ కౌశిక్రెడ్డిని గవర్నర్ కోటా నుంచి తప్పించి ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీగా నామినేట్చేశారు.
2. శాసనమండలికి చైర్మన్ ప్రొటెంగా ఎంఐఎం సభ్యుడు, సీనియర్ జర్నలిస్టు అమీనుల్ జాఫ్రీని రికమండ్ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఫైల్ను గవర్నర్కు పంపించింది. గవర్నర్ దీనిపై నిర్ణయం తీసుకోకుండా నాన్చివేత ధోరణితో వ్యవహరించారు. చైర్మన్ ప్రొటెం ఎందుకు? డైరెక్ట్గా చైర్మన్ ఎన్నిక పెట్టాలని గవర్నర్ ప్రభుత్వానికి సలహా ఇచ్చినట్టు సమాచారం. ప్రభుత్వవర్గాలేమో.. ఉత్తరప్రదేశ్లో 13 నెలల పాటు చైర్మన్ ప్రొటెం ఉన్నట్టు గవర్నర్కు తెలియజేసినట్టు ప్రచారం జరిగింది. చివరకు దేశంలో ఏ ఏ రాష్ట్రాల్లో చైర్మన్ ప్రొటెంగా ఎన్ని నెలలపాటు ఉన్నారో సవివరమైన సమాచారాన్ని సేకరించి గవర్నర్కు ప్రభుత్వం అందజేసింది. దాంతోపాటు ఈ పదవి విషయంలో రాజ్యాంగం ఏం చెప్తున్నదో కూడా వివరించింది. ఇంత జరిగాక జాఫ్రీని చైర్మన్ ప్రొటెంగా నియమిస్తూ ప్రభుత్వ ప్రతిపాదనలకు గవర్నర్ ఆమోదం తెలుపాల్సి వచ్చిందని పలువురు మాజీ ఎమ్మెల్సీలు బాహటంగానే వ్యాఖ్యానించారు.
3. గవర్నర్ శాసనసభ ఉభయసభలను ఉద్దేశించి ప్రసంగించినా.. 26 జనవరి నాడు జెండా ఎగురవేసి మాట్లాడినా ప్రభుత్వం (మంత్రి మండలి) ఆమోదించిన ప్రసంగాన్ని మాత్రమే చదువాలి. సొంతంగా ప్రసంగించడానికి రాజ్యాంగం ఒప్పుకోదు. కానీ, ఈసారి జనవరి 26న గవర్నర్ ప్రసంగాన్ని రాష్ట్ర ప్రభుత్వం పంపించలేదు. అయినప్పటికీ గవర్నర్ తన సొంత ప్రసంగాన్నే చదివారు. వాస్తవానికి జనవరి 26వ తేదీ ప్రసంగానికి సంబంధించి ప్రభుత్వం గవర్నర్తో చర్చించినట్టు సమాచారం. కరోనా మహమ్మారి నేపథ్యంలో ఎలాగూ బహిరంగ సభ లేదు కాబట్టి ఏలాంటి ప్రసంగాలు వద్దనుకొన్నారు. కానీ, గవర్నర్ అనూహ్యంగా 26 జనవరినాడు ప్రసంగించారు. ఇది ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టే చర్యగానే రాజ్యాంగ నిపుణులు భావిస్తున్నారు.
4. 2021-2022 గవర్నర్ బడ్జెట్ ప్రసంగంలో సైతం రాష్ట్ర మంత్రిమండలి ఆమోదించని కొన్ని పేరాలను సొంతంగా చదివారని పలువురు ఎమ్మెల్యేలు గుర్తుచేస్తున్నారు. అప్పుడు ప్రభుత్వం కూడా చూసీ చూడనట్టు వ్యవహరించింది.
5. దేశంలో, మన రాష్ట్రంలో గవర్నర్లకు, రాష్ట్ర ప్రభుత్వాలకు మధ్య ఘర్షణాత్మక వైఖరి తలెత్తిన సందర్భాలు అనేకమున్నాయి. గతంలో రాంలాల్ గవర్నర్గా ఉన్నపుడు నాటి ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టే ప్రయత్నం చేశారు. ఆయన ఆ తర్వాత చాలా అవమానకరంగా రాష్ట్రం నుంచి వెళ్లిపోవాల్సి వచ్చింది. ఆ తర్వాత కృష్ణకాంత్ గవర్న్ర్గా ఉన్నప్పుడు కూడా ఇలాగే జరిగింది. నిన్న మొన్న మహారాష్ట్ర గవర్నర్ తన అనవసర వ్యాఖ్యల వల్ల శాసనసభలో అవమానకరంగా సభ జరుగుతుండగానే నిష్రమించాల్సి వచ్చింది. రాష్ట్ర ప్రభుత్వాలతో ఇచ్చిపుచ్చుకొనే ధోరణి, రాజ్యాంగబద్ధంగా నడుచుకొనే ధోరణి గవర్నర్లకు ముఖ్యమని నిపుణులు చెప్తున్నారు. ఇలా కాకుండా కేంద్ర ప్రభుత్వాల చేతిలో కీలుబొమ్మలుగా మారిన ఏ గవర్నర్ కూడా ఎకువ కాలం రాష్ట్రాల్లో పనిచేయలేకపోయారని గుర్తుచేస్తున్నారు. ఇప్పటికీ తెలంగాణాలో గవర్నర్ వ్యవస్థ ఇంకా చేయిదాటిపోలేదని, రాష్ట్ర ప్రభుత్వ ఉద్దేశాన్ని అర్థం చేసుకొని సహకరించాలని, పరస్పరం సహకరించుకొంటూ ముందుకు వెళ్తేనే మంచిదని, రెండు వ్యవస్థల మధ్య సఖ్యత ఉండాలని రాజ్యాంగ నిపుణులు చెప్తున్నారు.