డీడీయూ-జీకేవైలో విద్యార్థులను చేర్చుకునేందుకు మూడంచెల (మొబిలైజేషన్, ట్రైనింగ్, స్కిల్స్(ఎంఎస్ ఆఫీస్) విధానాన్ని పాటిస్తారు. అందులో మొబిలైజేషన్, ఆన్ఫీల్డ్ రిజిస్ట్రేషన్, స్క్రీనింగ్ విజిట్ అనే మూడు అంశాలు ఉంటాయి. మొబిలైజేషన్ చేసే వ్యక్తి గ్రామాల్లోని సర్పంచులు, పీఆర్ఓలు, గ్రామ కార్యదర్శులను కలిసి సంస్థ అందించే సేవలను వారికి వివరిస్తారు. వారి ద్వారా ఆ గ్రామంలోని యువత విద్యార్హతలను తెలుసుకొని వారికి ఈ ప్రాజెక్టు ద్వారా అందించే సేవలను వివరిస్తారు. విద్యార్థుల పేర్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత వారి తల్లిదండ్రులను ఒకరోజు స్క్రీనింగ్ విజిట్ కోసం ఆహ్వానిస్తారు. అనంతరం శిక్షణ పొందేందుకు, ఉద్యోగం చేసేందుకు సంసిద్ధత వ్యక్తం చేసిన విద్యార్థులకు వారి విద్యార్హతను బట్టి కోర్సు, కాల పరిమితి, నేర్పించనున్న స్కిల్స్ తదితర అంశాలను తెలియజేసి సంస్థలో చేర్చుకుంటారు.
గ్రామీణ ప్రాంత విద్యార్థులకు ఉచిత వసతి, శిక్షణతో పాటు ఉద్యోగాలు కల్పిస్తూ వారి జీవితాలకు భరోసాను కల్పిస్తున్నది మూసారాంబాగ్లోని శాలివాహననగర్లోని దీన్దయాళ్ ఉపాధ్యాయ
గ్రామీణ కౌసల్య యోజన కేంద్రం(డీడీయూ-జీకేవై). కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సంయుక్త ఆధ్వర్యంలో(60+40 శాతం)నిధులతో నిర్వహిస్తున్న ఈ సంస్థ, డాటా ప్రో సంస్థ సహకారంతో యువతకు పలు కంప్యూటర్ కోర్సుల్లో శిక్షణను ఇప్పిస్తూ, క్యాంపస్ ప్లేస్మెంట్ల ద్వారా ఉద్యోగాలు కల్పిస్తున్నది. ఉచిత శిక్షణతో పాటు వసతి, ఉపాధినిస్తూ కల్పతరువుగా మారింది.
అందించే కోర్సులు
టెన్త్, ఇంటర్, డిగ్రీ విద్యార్హతల ఆధారంగా 6, 4, 3, 5 నెలల కాల పరిమితి కలిగిన కోర్సులున్నాయి. కస్టమర్ రిలేషన్ మేనేజ్మెంట్ (సీఆర్ఎం-6 నెలలు), ఫీల్డ్ టెక్నీషియన్ కంప్యూటింగ్ పెరిపెరల్స్ (హార్డ్వేర్ అండ్ నెట్వర్క్-4 నెలలు), ఫ్రంట్ ఆఫీస్ అసోసియేట్- మూడున్నర నెలల కోర్సుల్లో శిక్షణ ఇస్తారు. వీటితోపాటు వెబ్డెవలపర్, లోన్ ప్రాసెసింగ్ ఆఫీసర్, కన్సైన్మెంట్ బుకింగ్ అసిస్టెంట్ కోర్సులూ అందుబాటులో ఉన్నాయి.
ఒక్కో విద్యార్థికి ముగ్గురు ట్రైనర్లు
ఇందులో ఒక్కో విద్యార్థికి ముగ్గురు శిక్షకులుంటారు. ఒకరు డొమైన్ ట్రైనర్ (ప్రభుత్వ సర్టిఫైడ్), స్పోకెన్ ఇంగ్లిష్, సాఫ్ట్ స్కిల్స్ ట్రైనర్, మరొకరు ఐటీ స్కిల్స్ (ఎంఎస్ ఆఫీస్). ప్రతిరోజూ ల్యాబ్లో ప్రాక్టికల్ శిక్షణ ఇస్తారు. కోర్సుల కాల పరిమితి ముగిసిన తర్వాత క్లాస్రూం ట్రైనింగ్ (ఆన్ జాబ్ ట్రైనింగ్-ఓజేటీ) ఉంటుంది. ఒక ఉద్యోగి ఒక కంపెనీలో ఎలా ఉద్యోగం చేస్తారో అదేవిధంగా యువతను ఒక కంపెనీలో చేర్పించి శిక్షణ ఇస్తారు.
కనీస వేతనం రూ.10 వేలు
శిక్షణ తర్వాత సాఫ్ట్వేర్ కంపెనీలు, హోటళ్లు, పర్యాటక కేంద్రాలు, హాస్పిటళ్లు, ట్రాన్స్పోర్ట్, ఇతర పెద్దపెద్ద కంపెనీల ప్రతినిధులతో మాట్లాడి కనీస వేతనం రూ.10 వేలు ఉండే సంస్థల్లో ప్లేస్మెంట్ ద్వారా ఉద్యోగం కల్పిస్తారు. ఉద్యోగంలో చేరిన విద్యార్థి ఆరునెలలు ట్రాకింగ్లో ఉంచి ప్రతినెలా ప్లేస్మెంట్ అధికారులు వారిని కలిసి ఉద్యోగ విషయంలో ఎదురవుతున్న సమస్యలు, జీతం వంటి విషయాల్లో తలెత్తే ఇబ్బందులను పరిష్కరిస్తారు.
2,459 మందికి ఉద్యోగాలు..
2016 నుంచి 2021 వరకు 3,091 మంది విద్యార్థులకు శిక్షణ ఇవ్వగా.. 2459 మందికి వివిధ సంస్థల్లో ఉద్యోగాలు కల్పించినట్లు డీడీయూ-జీకేవై సంస్థ స్టేట్ హెడ్, డాటా ప్రో సంస్థ నిర్వాహకులు రవీందర్ తెలిపారు. అయితే ఒకసారి ప్లేస్మెంట్లో ఉద్యోగం లభించని విద్యార్థులకు మరోసారి అవకాశాన్ని కల్పించి నూటికి నూరు శాతం విద్యార్థులకు ప్లేస్మెంట్ కల్పిస్తారు. విద్యార్థుల హాజరు పట్టిక, శిక్షణ, ప్రాక్టికల్స్, ఆన్ జాబ్ ట్రైనింగ్ వంటి అంశాలపై నిరంతర పర్యవేక్షణ ఉంటుందని సెంటర్ మేనేజర్ హరి దుర్గాప్రసాద్ తెలిపారు.
ఏటా 100 మంది రిక్రూట్మెంట్
డీడీయూ-జీకేవై సంస్థలో మంచి శిక్షణను ఇచ్చి ప్రావీణ్యం కలిగిన ఉద్యోగులుగా తీర్చిదిద్దుతారు. మాకు పెద్ద సంఖ్యలో ఉద్యోగుల అవసరం ఉంటుంది. ప్రతియేటా బిగ్ ‘సీ’కి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ర్టాల్లో వంద మందిని రిక్రూట్ చేసుకుంటాం. ఈ సంస్థతో మేము రెగ్యులర్గా టచ్లో ఉంటాం. మేము రిక్రూట్ చేసుకున్న ఉద్యోగుల నుంచి ఇంతవరకు మాకు చిన్న సమస్య తలెత్తలేదు.
చాలా బాగా శిక్షణ ఇస్తున్నారు..
శిక్షణ చాలాబాగుంది. ఐటీ, సాఫ్ట్స్కిల్స్ వంటివి నేర్పిస్తున్నారు. మా బంధువుల ద్వారా తెలుసుకొని శిక్షణ తీసుకుంటున్నాను. నా హయ్యర్ స్టడీస్ కంటిన్యూ చేయడంతోపాటు మా ఫ్యామిలీకి ఫైనాన్షియల్ సపోర్ట్ చేయగలుగుతాననే కాన్ఫిడెన్స్ వచ్చింది. లాక్డౌన్తో మా కుటుంబం చాలా కోల్పోవాల్సి వచ్చింది. దాన్ని భర్తీ చేస్తాననే నమ్మకం ఇక్కడికి వచ్చినాక కలిగింది.
-ఎ. కీర్తన (జోగులాంబ గద్వాల జిల్లా)
ఉద్యోగం లభిస్తుందనే నమ్మకం కలిగింది
నేను ఈ ఏడాదే డిగ్రీ పూర్తిచేశాను. సార్ వాళ్లు మా ఊరికి వచ్చి డిగ్రీ పూర్తిచేసిన వాళ్ల గురించి వాకబు చేయగా నేను ముందుకొచ్చాను. మూడు నెలలుగా ఈ సంస్థలో ఫ్రంట్ ఆఫీసు అసోసియేట్గా శిక్షణ తీసుకుంటున్నాను. ఇంత బాగా ఉంటుందని అనుకోలేదు. మంచి ఉద్యోగం లభిస్తుందనే నమ్మకం కలిగింది.
శిక్షణతో పాటు ఉద్యోగాలు కల్పిస్తున్నాం
గ్రామీణ ప్రాంత విద్యార్థులకు ఉపాధి కల్పించే నిమిత్తం ఏర్పాటు చేయబడింది ఈ సంస్థ. డాటాప్రో సంస్థ సహకారంతో విద్యార్థులకు కంప్యూటర్ కోర్సుల్లో శిక్షణ ఇస్తున్నాం. శిక్షణ అనంతరం పెద్దపెద్ద కంపెనీల్లో ప్లేస్మెంట్ల ద్వారా ఉపాధి కల్పిస్తున్నాం. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సంయుక్త ఆధ్వర్యంలో నడుస్తున్న దీనిపై నిరంతర పర్యవేక్షణ ఉంటుంది.