(నమస్తే తెలంగాణ): కరోనా కట్టడిలో భాగంగా మూడో రోజు ఇంటింటా ఫీవర్ సర్వే ముమ్మరంగా కొనసాగింది. ప్రభుత్వ ఆదేశాల మేరకు గ్రేటర్ హైదరాబాద్లో కొవిడ్ నియంత్రణకు జీహెచ్ఎంసీ, వైద్య ఆరోగ్య శాఖలకు చెందిన బృందాలు మూడో రోజైన ఆదివారం ఇంటింటికీ తిరిగి జ్వరం, కొవిడ్ లక్షణాలున్న వారి సర్వే చేపట్టాయి. 1,440 బృందాలు సర్వేలో పాల్గొన్నాయి. ఒక్కో బృందంలో ఒక ఏఎన్ఎం, ఆశా వర్కర్, జీహెచ్ఎంసీ ఎంటమాలజీ వర్కర్తో కూడిన సభ్యులు ధర్మోస్కానర్తో 17,700 ఇండ్లలో తిరిగి ఫీవర్ సర్వే చేపట్టారు. 770 మందికి జ్వర లక్షణాలు ఉన్నట్లు గుర్తించి, బృందం సభ్యులు వీరికి వెంటనే మందుల కిట్ను అందజేశారు. కాగా, ఈ ఫీవర్ సర్వేలో జ్వరం కేసులు ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో జీహెచ్ఎంసీ సిబ్బంది యాంటీ లార్వా ద్రావకాన్ని పిచికారి చేస్తున్నారు.
బాధితులకు సలహాలు, సూచనలు..
మహా నగరం పరిధిలోని 30 సర్కిళ్లలో ఈ సర్వే కొనసాగుతున్నది. ఏఎంఓహెచ్ల పర్యవేక్షణలో ఏఎన్ఎం, ఆశా వర్కర్లు, ఎంటమాలజీ సిబ్బందితో బృందాలను ఏర్పాటు చేశారు. ప్రతి 60 ఇళ్లకు ఒక బృందం సాధారణంగా పనిచేస్తోంది. ఈ వైద్య బృందం ప్రతి ఇంటిని సందర్శించడం, ఇంట్లోని వారికి జలుబు, దగ్గు, జ్వరం వంటి లక్షణాలున్న వారిని గుర్తించడం, వారి పేర్లు నమోదు చేసుకుని అవసరమైన మందులు ఇవ్వడం, తీవ్ర లక్షణాలున్న వారిని గాంధీ, టిమ్స్ తదితర కరోనా కేర్ సెంటర్లకు తరలించడం, టీకా తీసుకోని వారిని గుర్తించి, వారికి దగ్గరలో ఉన్న టీకా కేంద్రాలకు సిఫారసు చేసి టీకా తీసుకునే విధంగా ప్రోత్సహించడం, అనుమానితులను గుర్తించి వారికి కరోనా పరీక్షలు చేయించడం, వృద్ధులు, గర్భిణులు ఉంటే వారికి ఇంటి వద్దనే కరోనా పరీక్షలు జరపడం వంటి చర్యలు చేపడుతున్నారు. కరోనా లక్షణాలుంటే ఐదు రోజులకు సరిపడా ఆయా మాత్రలతో పాటు వైద్యులు సూచించే యాంటీ బయాటిక్స్ ఇస్తున్నారు. తీవ్ర జ్వరం ఉండి తగ్గకున్నా శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఉన్నా, ఇతరత్రా సమస్యలు తలెత్తితే దవాఖానకు వెళ్ళాలని చెబుతున్నారు. వ్యాక్సినేషన్ వివరాలను అడిగి తెలుసుకుంటూ వ్యాక్సిన్ కేంద్రాల వివరాలను వారికి తెలియపర్చుతున్నారు. థర్డ్ వేవ్ను సమర్థవంతంగా ఎదుర్కొనేలా చర్యలు చేపడుతూ, పక్కాగా ఫీవర్ సర్వే జరుపుతూ ప్రజల ఆరోగ్యానికి సర్కారు రక్షణ కల్పిస్తుండటం గమనార్హం.
ఫీవర్ కేసులున్న ప్రాంతాల్లో హైపోక్లోరైడ్ స్ప్రే
ఫీవర్ కేసులు ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో జీహెచ్ఎంసీ ఎంటమాలజి సిబ్బంది సోడియం హైపోక్లోరైడ్ స్ప్రే చేపడుతున్నారు. ఆదివారం 4,200 ఇండ్లలో స్ప్రే చేసినట్లు అధికారులు వెల్లడించారు. వీటితో పాటు స్కూళ్లు, కాలేజీలు, చర్చీలు, ప్రార్థన మందిరాలు, బస్టాపులు, రైల్వే స్టేషన్లు, ఫంక్షన్ హాళ్లలో విస్తృతంగా స్ప్రే చేపట్టారు.
మేడ్చల్ జిల్లాలో…
మేడ్చల్, జనవరి 23 (నమస్తే తెలంగాణ): మేడ్చల్ జిల్లా వ్యాప్తంగా ఫీవర్ సర్వే కొనసాగుతుంది. ఆదివారం నిర్వహించిన ఫీవర్ సర్వేలో 3143 మందికి హోం ఐసొలేషన్ కిట్లను అందజేశారు. 877 వైద్య బృందాలు జిల్లాలోని మేడ్చల్, కూకట్పల్లి, కుత్బుల్లాపూర్, మల్కాజిగిరి, ఉప్పల్ నియోజకవర్గాలలోని 63, 717 ఇళ్లలో ఫీవర్ సర్వేను నిర్వహించినట్లు జిల్లా వైద్యాధికారి మల్లిఖార్జునరావు తెలిపారు.