జూబ్లీహిల్స్,ఫిబ్రవరి 3: కరోనా కట్టడికి జీహెచ్ఎంసీ ఆధ్వర్యంలో ముమ్మరంగా జ్వర సర్వే, వ్యాక్సిన్ క్యాం పులు చేపడుతున్నారు. ఆరోగ్య, ఆశ వర్కర్లతో కలిసి జీహెచ్ఎంసీ సిబ్బంది జలుబు, జ్వరం లక్షణాలున్న వారిని గుర్తించేందుకు ఇంటింటికీ వెళ్లి వివరాలు సేకరిస్తున్నారు. దగ్గు, జ్వరం ఉన్నవారికి అక్కడే హోమ్ ఐసొలేషన్ కిట్లు అందజేస్తున్నారు.
యూసుఫ్గూడ, రహ్మత్నగర్, బోరబండ, వెంగళరావునగర్, ఎర్రగడ్డ డివిజన్లలో 50 బృందాలతో వివరాలను నమోదు చేస్తున్నారు. శ్రీరాంనగర్, బోరబండ, వినాయక్నగర్ పీహెచ్సీల వైద్య, యూసుఫ్గూడ జీహెచ్ఎంసీ అధికారుల ఆధ్వర్యంలో ఏఎన్ఎంలతో పాటు ఆశ వర్కర్లు, జీహెచ్ఎంసీ ప్రత్యేక బృందాలతో వివరాలు సేకరిస్తున్నారు. గురువారం 4,684 మందికి సర్వే చేసి జ్వర లక్షణాలున్న 218 మందికి కిట్లు పంపిణీ చేసినట్లు అధికారులు తెలిపారు. యూసుఫ్గూడ సర్కిల్లో డీఎంసీ రమేశ్ ఆధ్వర్యంలో ఏఎంఓహెచ్ డాక్టర్ బిందుభార్గవి, ఎస్పీహెచ్వో డాక్టర్ అనురాధ సర్వేను పర్యవేక్షించారు.
విద్యార్థులకు వ్యాక్సినేషన్..
ప్రభుత్వ నిబంధనల మేరకు 15 నుంచి 18 ఏండ్ల విద్యార్థులకు మొదటి డోస్ వ్యాక్సినేషన్ పూర్తిచేసిన వైద్యాధికారులు తాజాగా రెండో డోస్ వ్యాక్సినేషన్ను చేపడుతున్నారు. ఇటీవల పాఠశాలలు తెరుచుకోవడంతో పాటు నెలరోజుల వ్యవధి ముగియడంతో ఆయా విద్యార్థులకు రెండో డోస్ వ్యాక్సినేషన్ను చేపట్టారు. యూసుఫ్గూడ సర్కిల్లోని శ్రీరాంనగర్ పీహెచ్సీలో 2,469 మందికి, వినాయక్నగర్ పీహెచ్సీలో 940 మందికి , బోరబండ పీహెచ్సీ పరిధిలో 2,364 మంది విద్యార్థులకు ఫస్ట్డోస్ టీకాలు ఇచ్చినట్లు వైద్యులు తెలిపారు.