న్యూఢిల్లీ, మార్చి 26: ఓ వైపు పెట్రోల్, మరోవైపు నిత్యావసరాల ధరలతో కుదేలవుతున్న సామాన్యుడిపై మరో పిడుగు. జ్వరం, బీపీ, రక్త హీనత లాంటి సాధారణ ఆరోగ్య సమస్యలతోపాటు గుండె జబ్బులకు వాడే 800 రకాల అత్యవసర ఔషధాల ధరలను కూడా కేంద్రప్రభుత్వం పెంచింది. అత్యవసర ఔషధాల ధరలను 10.7% పెంచుతున్నట్టు జాతీయ ఔషధ ధరల నిర్ణాయక మండలి(ఎన్పీపీఏ) శనివారం సర్క్యులర్ జారీ చేసింది. పెరిగిన ధరలు వచ్చే నెల 1వ తేదీ నుంచి అమల్లోకి రానున్నట్టు వెల్లడించింది. ‘2020తో పోలిస్తే 2021లో హోల్సేల్ ప్రైస్ ఇండెక్స్(డబ్ల్యూపీఐ) 10.7% పెరిగింది. అందుకే ఔషధ ధరలను పెంచాం’ అని ఎన్పీపీఏ తన సర్క్యులర్లో పేర్కొన్నది. ధరలు పెరిగినవాటిలో.. పారాసిటమాల్, అజిత్రోమైసిన్, విటమిన్ మాత్రలు ఉన్నాయి. కరోనా ముప్పు పూర్తిగా తొలగిపోకముందే కేంద్రం ఔషధ ధరలను పెంచడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
హైదరాబాద్, మార్చి 26 (నమస్తే తెలంగాణ): ఔషధాల ధరలు పెంచడానికి కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇవ్వటంపై ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత మండిపడ్డారు. బీజేపీ ప్రభుత్వం సామాన్యులపై అన్నివైపుల నుంచి దాడి చేస్తున్నదని విమర్శించారు. ఫార్మాస్యూటికల్ ప్రైసింగ్ అథారిటీ ఆఫ్ ఇండియా 800 ఔషధాలపై 10.7 శాతం ధరలను పెంచేందుకు అనుమతి ఇచ్చినట్టు వచ్చిన వార్తను శనివారం ఆమె ట్వీట్ చేస్తూ ‘గ్యాస్, డీజిల్, పెట్రోల్.. ఆహార పదార్థాలపై విపరీతంగా ధరలు పెంచిన కే్రందంలోని బీజేపీ ప్రభుత్వం ఇప్పుడు ఔషధాల ధరలను పెంచింది’ అని ధ్వజమెత్తారు.