టెన్నిస్ స్టార్, బాక్సింగ్ క్వీన్, క్రికెట్ తార.. ఛానెల్స్ తిరగేసేకొద్దీ ప్రకటనలే. ఆ ప్రకటనల నిండా క్రీడాకారిణులే! జూలై-డిసెంబర్ మధ్యకాలంలో ఏరికోరి స్పోర్ట్స్ సెలెబ్రిటీలను ప్రచారకర్తలుగా ఎంచుకున్న కంపెనీల సంఖ్య బాగా పెరిగిందని అధ్యయనాలు చెబుతున్నాయి.
క్రీడాకారిణుల ఎండార్స్మెంట్లు ముప్పైశాతం అధికం అయినట్టు టీఏఎమ్ మీడియా రీసెర్చ్ లెక్కలు కూడా నిర్ధారిస్తున్నాయి. ఆ మేరకు పురుష క్రీడాకారుల రాబడి తగ్గిపోయినట్టే.
కార్పొరేట్ వ్యూహకర్తలు మహిళా స్పోర్ట్స్ స్టార్స్ను ఎంచుకోవడం వెనుకా ఓ పక్కా వ్యూహం ఉంది. పురుషులతో పోలిస్తే మహిళలు ఘన విజయాలే సాధిస్తున్నారు. తరచూ వార్తల్లో నిలుస్తున్నారు. సామాజిక మాధ్యమాల్లోనూ వాళ్లదే హవా. కొత్తతరం ఓటు కూడా ఆటలక్కలకే. పీవీ సింధు, షఫాలీ వర్మ, మిథాలీ రాజ్.. తదితరులు ఆ జాబితాలో ఉన్నారు. బ్రాండ్ అంబాసిడర్ల నియామకంలోనూ మగువలకే పెద్దపీట. ఈ మధ్యే ఉమెన్స్ క్రికెట్ టీమ్ కెప్టెన్ హర్మన్ప్రీత్ కౌర్ను తమ వాణిజ్య రాయబారిగా నియమించుకుంది ప్యూమా ఇండియా.