అసలే అడవి. అక్కడక్కడా పులులు. హఠాత్తుగా స్మగ్లర్ల దాడులు. అడవిని కాపాడుతూ, వన్యమృగాలకు రక్షణనిస్తూ, స్మగ్లర్ల పాలిట సింహస్వప్నంగా నిలుస్తున్నారు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పరిధిలోపనిచేస్తున్న నూట నలభైమంది.. అటవీశాఖ మహిళా ఉద్యోగులు. ఒత్తిళ్లను ఎదుర్కొంటూ, సవాళ్లను అధిగమిస్తూ అడవిలో నిర్భయంగా విధులు నిర్వర్తిస్తున్న ఫారెస్టు అధికారులు, బీట్ సిబ్బందిపై ప్రత్యేక కథనం..
భద్రాద్రి కొత్తగూడెం అటవీ ప్రాంతం విస్తారమైంది. భద్రాచలం ఎజెన్సీ ప్రాంతమైన చర్ల మండలం నుంచి వైరా నియోజకవర్గం వరకు 4,17,383 హెక్టార్లలో విస్తరించి ఉంది. పచ్చదనాల పట్టుచీర కట్టుకున్న ఆ అడవి తల్లిని అటవీశాఖ మహిళా ఉద్యోగులు కంటికి రెప్పలా కాపాడుతున్నారు. వన సంపదను ఎత్తుకెళ్లడానికి గద్దల్లా ఎదురుచూసే స్మగ్లర్లకు సవాలు విసురుతున్నారు. వన్యప్రాణుల చర్మమాంసాలతో వ్యాపారం చేసుకునే రక్త బేహారులకూ ఇక్కడ కొదవ లేదు. ఆ పహరా బృందం అడుగుల చప్పుడు వినిపిస్తే చాలు.. స్మగ్లర్లకు వణుకే. విద్రోహ శక్తులపై ఉక్కుపాదం మోపే ఆ మహిళలు, మూగ జీవాలు కనిపిస్తే మాత్రం మాతృప్రేమ కురిపిస్తారు. తాగునీటి సౌకర్యం కల్పిస్తారు. పచ్చగడ్డివేసి పొట్ట నింపుతారు. వేసవిలో అయితే.. మరిన్ని జాగ్రత్తలు తీసుకుంటారు. బీట్ ఆఫీసర్లు, ఫారెస్ట్ గార్డులు, సెక్షన్ అధికారులు, డీఆర్ఓలు, రేంజ్ అధికారులు.. హోదా ఏదైనా అదే నిబద్ధత. అంతే చిత్తశుద్ధి. ఉన్నతాధికారులు సైతం ఆ అంకిత భావాన్ని ప్రశంసించిన సందర్భాలు అనేకం.
అనుక్షణం సవాళ్లే..
ఎజెన్సీ గిరిజన ప్రాంతంలో.. అటవీశాఖ మహిళా ఉద్యోగులు మగవాళ్లతో సమానంగా విధులు నిర్వర్తిస్తున్నారు. కిలోమీటర్ల దూరం కాలి నడకనే వెళ్తున్నారు. ఎక్కడ ఏ క్రూర మృగాలు ఉంటాయో తెలియని పరిస్థితి. అయినా ధైర్యంగా అడుగు ముందుకేస్తారు. అక్రమ ఇసుక వ్యాపారుల ఆట కట్టిస్తూ..
ప్రకృతికి, పచ్చదనానికి అండగా నిలుస్తున్నారు. సీసీ కెమెరాల నిఘాతో చీమ చిటుక్కుమన్నా కనిపెట్టేస్తున్నారు. చెక్పోస్టుల వద్ద మరింత అప్రమత్తంగా ఉంటున్నారు. ‘అడవి, అడవిలోని ప్రాణులు-ఈ రెండూ మాకు రెండు కళ్లు’ అంటారు ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ జి.శ్రీదేవి. ‘అడవిలో పనిచేయడం సవాలే అయినా.. ఇష్టంగా చేస్తున్నాం. అధికారులు కూడా మద్దతుగా నిలుస్తున్నారు. ఇది మా అదృష్టం’ అని వివరిస్తారు మరో బీట్ అధికారి శారద. ‘మొక్కలు పెంచడం నా లక్ష్యం. అందుకే కోరికోరి ఈ ఉద్యోగంలో చేరాను. మనం ఎన్ని చెట్లు పెంచితే.. పకృతి మనకు అంత మంచి వాతావరణాన్ని ఇస్తుంది. పర్యావరణం బాగుండాలంటే.. ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలి. అడవిని కాపాడాలి. పకృతి ఒడిలో పనిచేయడం అదృష్టంగా భావిస్తున్నా’ అంటున్నప్పుడు బీట్ ఆఫీసర్ అనూష మాటల్లో పచ్చదనం పట్ల అవ్యాజమైన ప్రేమ. ‘జీవవైవిధ్యమే ప్రకృతి సమతౌల్యానికి ప్రాణం. సృష్టిలోని ప్రతి జీవికీ బతికే హక్కు ఉంటుంది. అందుకే, మేం అడవిలో నీటి కుంటలు ఏర్పాటు చేస్తున్నాం. అడవి నిండా జంతువులు ఉంటే.. స్మగ్లర్లు అటువైపు కన్నెత్తి చూసే ధైర్యం చేయరు’ అని వివరిస్తారు దుర్గ.
స్త్రీని ప్రకృతితో పోలుస్తారు కవులు. ఆ ప్రకృతి సంరక్షణ బాధ్యత సాక్షాత్తు స్త్రీకే అప్పగిస్తే.. తనను తాను రక్షించుకున్నట్టు అడవిని కాపాడుకుంటుంది ఆమె. తన బిడ్డల్లానే వన్యమృగాలనూ పోషిస్తుంది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో జరుగుతున్నది ఆ అద్భుతమే.
అటవీశాఖలో ఉద్యోగం అంటే రోజూ సవాళ్లే. ఓ సందర్భంలో ఊరు ఊరంతా ఎదురుతిరిగింది. దాడికి వచ్చింది. అయినా బీట్ ఆఫీసర్ అనూష.. వెనక్కి తగ్గలేదు. చాకచక్యంగా గుంపును చెదరగొట్టారు. తానూ సురక్షితంగా బయటపడ్డారు. కొన్నిసార్లు వేటగాళ్లు కంట్లో కారం చల్లే ప్రయత్నం చేస్తారు. స్మగ్లర్లు ప్రాణాలు తీస్తామని బెదిరిస్తారు. అవేవీ.. మహిళా సిబ్బంది ఆత్మస్థయిర్యాన్ని తగ్గించలేక పోయాయి. చేతిలో గన్ లేకపోతేనేం, ఒంటి మీద ఖాకీ యూనిఫామ్నే ఆయుధంగా భావిస్తారు.