న్యూఢిల్లీ, మే 11: అరబిందో ఫార్మాస్యూటికల్కు యూఎస్ ఫుడ్, డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ (యూఎస్ఎఫ్డీఏ) షాకిచ్చింది. కంపెనీకి హైదరాబాద్ సమీపంలోని జడ్చర్లలో ఉన్న తయారీ ప్లాంట్ను తనిఖీ చేసిన మీదట ఆరు అభ్యంతరాల్ని అమెరికా రెగ్యులేటర్ జారీచేసింది. ఓరల్ ఔషధాల్ని తయారు చేసే ఈ ప్లాంట్లో మే 2 నుంచి 10 వరకూ ఎఫ్డీఏ అధికారులు తనిఖీలను నిర్వహించిన మీదట ఆరు అభ్యంతరాలతో కూడిన ’ఫారమ్ 483’ను జారీచేశారు. ఎఫ్డీఏ గుర్తించిన లోపాల్ని నిర్ణీత సమయంలోగా కంపెనీ సరిచేయాల్సి ఉంటుంది. విటమిన్ బి12 లేమితో ఏర్పడే రుగ్మతల చికిత్సకు ఉపయోగించే సైనోకోబాలమిన్ ఇంజెక్షన్లను అమెరికా మార్కెట్ నుంచి అరబిందో ఫార్మా సబ్సిడరీ రీకాల్ చేసినట్టు ఎఫ్డీఏ తెలిపింది. ఈ వార్తల నేపథ్యంలో బుధవారం బీఎస్ఈలో అరబిందో ఫార్మా షేరు 3 శాతంపైగా క్షీణించి 52 వారాల కనిష్ఠస్థాయి రూ. 584 వద్ద ముగిసింది.