తీవ్రంగా గాయపడిన భార్య
చేతిలో ఉన్న రాడ్ విద్యుత్ తీగలకు తగిలి ప్రమాదం
సంగారెడ్డి జిల్లా ఇస్నాపూర్ చౌరస్తాలో ఘటన
ఆగమైన వలస కార్మికుడి కుటుంబం
పటాన్చెరు, డిసెంబర్ 27 : విద్యుదాఘాతానికి గురై వలస కార్మికుడు, అతని రెండేండ్ల కూతురు మృత్యువాత పడిన ఘటన సోమవారం సంగారెడ్డి జిల్లా పటాన్చెరు మండలం ఇస్నాపూర్లో చోటుచేసుకుంది. పటాన్చెరు సీఐ శ్రీనివాస్, ఎస్సై రా మానాయుడు, స్థానికుల వివరాల ప్రకారం.. ఒడిశా రాష్ట్రం జగత్సింగ్పూర్ జిల్లా జాగిపూర్కు చెందిన బాసుదేవ్ మల్లిక్(36) పదేండ్ల క్రితం పటాన్చెరు మండలం ఇస్నాపూర్కు వలస వచ్చాడు. స్థానిక కిర్బి పరిశ్రమలో పర్మినెంట్ కార్మికుడిగా పనిచేస్తున్నాడు. భార్య రీనా మల్లిక్, ఇద్దరు కుమార్తెలతో కలిసి ఇస్నాపూర్ చౌరస్తాలో ఓ ఇంట్లో అద్దెకు ఉంటున్నాడు. సోమవారం మధ్యాహ్నం ఇంట్లోని రెండో అంతస్తులో ఉన్న బాసుదేవ్ మల్లిక్ ఒక రాడ్తో ఏదో పనిచేస్తున్న సమయంలో అతడి చేతిలోని రాడ్ ఇంటి ముందున్న 11కేవీ విద్యుత్ తీగలకు తగిలింది. దీంతో బాసుదేవ్ మల్లిక్ విద్యుదాఘాతానికి గురై, రెయిలింగ్పైనే తుదిశ్వాస వదిలా డు. నాన్నకు ఏదో జరిగిందని గుర్తించిన రెండేండ్ల చిన్నారి కున్ను మల్లిక్ వెళ్లి తండ్రి కాళ్లను వాటేసుకుని అక్కడికక్కడే తీవ్రంగా కాలి బుగ్గిపాలైంది.
భర్త, కూతురికి కరెంట్షాక్ తగలడం చూసిన భార్య రీనా మల్లిక్ పరుగెత్తుకుంటూ వెళ్లి వారిద్దరినీ చేతులతో గుంజే ప్రయత్నం చేయగా, ఆమె విద్యుత్ షాక్కు గురై తీవ్రంగా గాయపడింది. ఈ ఘటనలో తండ్రీకూతురు సంఘటనా స్థలంలోనే మరణించారు. ఎదుటి బిల్డింగ్ నుంచి చూసిన వారు గమనించి విద్యుత్శాఖ అధికారులకు సమాచారమిచ్చి, కరెంట్ సరఫరాను నిలిపివేశారు. విద్యుత్ అధికారులు వచ్చి చూసేసరికి తం డ్రిని వాటేసుకుని కూతురు కూడా మరణించడం చూసి దిగ్భ్రాంతికి గురయ్యారు. రీనా స్పృహలో ఉండడంతో తక్షణమే అంబులెన్స్లో ఆమెను చం దానగర్లోని ప్రైవేట్ దవాఖానకు తరలించారు. పరిస్థితి విషమంగా ఉందని గుర్తించిన డాక్టర్లు, సి కింద్రాబాద్లోని గాంధీ దవాఖానకు తరలించారు. వారి ఆరేండ్ల కూతురు స్కూల్లో ఉండడంతో ఆమె క్షేమంగా ఉంది. చిన్నారి కున్ను మల్లిక్ హైటెన్షన్ కరెంట్ కారణంగా కాలిబూడిద ముద్దలా మారింది. పటాన్చెరు పోలీసులు కేసు నమోదు చేసుకుని, మృతదేహాలను పటాన్చెరు ఏరియా దవాఖానకు తరలించారు.
ఘటనా స్థలాన్ని పరిశీలించిన డీఎస్పీ భీంరెడ్డి
ఘటనా స్థలాన్ని పటాన్చెరు డీఎస్పీ భీంరెడ్డి సందర్శించారు. సీఐ శ్రీనివాస్ ఆధ్వర్యంలో జరుగుతున్న దర్యాప్తును పరిశీలించారు. స్థానికులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. స్కూల్కి వెళ్లి క్షేమంగా ఉన్న విద్య(6)ను సంఘటనా స్థలానికి తీసుకుని రాగా, స్థానికులు కూడా ఆ పాపను చూసి కన్నీటి పర్యంతమయ్యారు. ఇస్నాపూర్ ఎంపీటీసీ గడ్డం శ్రీశైలం బాధిత కుటుంబ వివరాలను పోలీసులకు వివరించారు.