సినీ నటుడు ఆర్ నారాయణమూర్తి
నర్సంపేట, అక్టోబర్ 20: కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తీసుకొచ్చిన నల్లచట్టాలు రైతులకు శాపమని, ఆ చట్టాలు అమలైతే రైతులను మ్యూజియంలోనే చూడాల్సి వస్తుందని సినీ నటుడు, నిర్మాత ఆర్ నారాయణమూర్తి ఆందోళన వ్యక్తం చేశా రు. బుధవారం వరంగల్ జిల్లా నర్సంపేటలో జరిగిన వామపక్షాల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. నూతన వ్యవసాయ చట్టాలతో రైతులకు తీవ్రనష్టం చేకూరుతుందన్నారు. ఈ చట్టాలను రద్దు చేయాలని రైతులు తొమ్మిది నెలలుగా ఆందోళన చేస్తున్నారని, 600 మంది బలిదానాలు చేసుకున్నారని అయినా ప్రధాని మోదీ పట్టించుకోకపోవడం దారుణమన్నారు. రైల్వేలు, వ్యవసాయం, ఎల్ఐసీ, విద్య తదితర శాఖలను ప్రైవేట్పరం చేయడం వల్ల ఇబ్బందులు ఏర్పడుతాయని తెలిపారు. విద్యుత్తు కనెక్షన్లకు మీటర్లు పెడితే ఇకపై తెలంగాణలో కేసీఆర్ ప్రభుత్వం ఇస్తున్న 24 గంటల ఉచిత కరెంటు ఇవ్వలేని పరిస్థితి నెలకొంటుందన్నారు. 2006 నుంచి బీహార్లో ఒకే ప్రాంతం, ఒకే విధా నం అమలు చేస్తున్నారని, దీనివల్ల అక్కడి రైతులు కూలీలుగా మారినట్టు ఆయన పేర్కొన్నారు. డాక్టర్ స్వామినాథన్ కమిటీ సూచించిన సిఫారసులను అమలు చేయాలని కోరారు. పంటలకు మద్దతు ధర అందించాలని డిమాండ్ చేశారు. మోదీ సర్కారు దిగివచ్చే వరకు రైతులు సమష్టిగా పోరాటాలు చేయాలని ఆయన పిలుపునిచ్చారు.