కేంద్రం వ్యవసాయ రంగంలో మార్పులు తెచ్చే ఉద్దేశంతో తెచ్చిన మూడు చట్టాలపై రైతాంగం స్వతంత్ర భారత చరిత్రలో కనీవినీ ఎరుగని రీతిలో పోరాటం సాగించి, విజయం సాధించింది. సుదీర్ఘమైన ఈ సంఘటిత పోరాటానికి ఏడు ప్రత్యేకతలున్నాయి. అవి ఏవంటే..
2020 నవంబర్ 26న మొదలైన రైతుల ఆందోళన శక్తిమంతమైనది, సుదీర్ఘమైనదే కాదు, అతిపెద్దది కూడా. దేశంలోని సుమారు 500 రైతు సంఘాలు సంయుక్త కిసాన్ మోర్చా (ఎస్కేఎం) పేరిట ఒకే గొడుగు కిందకు వచ్చాయి.
బాష్పవాయు గోళాలు, నీటి ఫిరంగులు, లాఠీచార్జీలు, జనవరి 26న జరిగిన ప్రభుత్వ ప్రాయోజిత హింసాకాండ, విచ్చలవిడి అరెస్టులు, రైతు నేతలపై, ప్రముఖ పాత్రికేయులపై ఎఫ్ఐఆర్లు, పర్యావరణ కార్యకర్తల అరెస్టులు, న్యూక్లిక్ వంటి స్వతంత్ర పోర్టల్స్పై ఈడీ దాడుల వంటి పలు రకాల అణచివేతలను రైతులు ఎదుర్కొన్నారు.
రైతులను అప్రతిష్ఠపాలు చేసేందుకు లెక్కలేనన్ని ప్రయత్నాలు జరిగాయి. ఖలిస్తానీలు, మావోయిస్టులు, పాకిస్థాన్, చైనా ఉసిగొల్పితే రైతులు రంగంలోకి దిగారని ప్రభుత్వ అనుకూల వర్గాలు సోషల్మీడియాలో దుమ్మెత్తి పోశాయి. అయినా రైతులు చలించలేదు.
90 రోజులపాటు లక్షల మంది రైతులు ఢిల్లీని ముట్టడించినా ఆ ముట్టడి ప్రశాంతంగా, ప్రజాస్వామ్యయుతంగా సాగింది. ఇప్పటివరకు ఈ పోరాటంలో 750 మందికిపైగా రైతులు అమరులయ్యారు. రిపబ్లిక్ దినోత్సవం రోజున ప్రభుత్వం కుట్రపూరితంగా హింసాకాడకు తెరతీసినప్పటికీ రైతులు రెచ్చిపోకుండా సంయమనం పాటించారు.
యావత్తు పోరాటం లౌకికవాద పద్ధతుల్లోనే నడిచింది. దేశవ్యాప్తంగా అన్ని మతాలు, కులాలు, భాషలకు చెంది రైతులు ఒక్కతాటి మీద నిలిచి గెలిచారు. దీనివల్లే ఆందోళనను అణచడం కేంద్ర సర్కారుకు సాధ్యం కాలేదు.
డిసెంబర్ 8న అపూర్వమైన రీతిలో జరిగిన భారత్ బంద్ రైతుల ఆందోళనకు దేశంలోని కార్మిక, తదితర వర్గాల మద్దతును విస్పష్టంగా వెల్లడించింది. దాంతో ఆ ఉద్యమం ప్రజాపోరాట రూపాన్ని దాల్చింది.
చివరిది, అతి ముఖ్యమైనది కేంద్ర సర్కారుకు, అంబానీ, అదానీ సంకేతాలుగా నిలిచిన స్వదేశీ, విదేశీ కార్పొరేట్లకు మధ్యన గల అనుబంధాన్ని రైతాంగం బట్టబయలు చేసి తుత్తునియలు చేయడం. ఈ చరిత్రాత్మకమైన వర్గపోరాటంలో రైతులు.. ఆర్థిక సంస్కరణల పేరిట ప్రవేశపెడుతున్న మార్పులను తిరస్కరించారు. దేశచరిత్రలో మొదటిసారిగా రైతులు అంబానీ, అదానీ ఉత్పత్తులను బహిష్కరించాలని పిలుపునివ్వడం గమనార్హం.