సాగు చేయడం వల్ల రైతులు అధిక లాభాలు పొందే అవకాశాలు ఉన్నాయని భారతీయ నూనెగింజల పరిశోధన సంస్థ (ఐఐఓఆర్) ఇన్చార్జి డైరెక్టర్ డా.దినేశ్ కుమార్ చెబుతున్నారు. ఖరీఫ్లో నీటి వనరులు పెరగడం వల్ల రైతులు ఎక్కువగా వరివైపు వెళ్లారనీ, రబీలో ఈసారి మెట్ట సాగు గణనీయంగా పెరగనున్నదని ఆయన అంటున్నారు. ఈ క్రమంలో నూనె గింజల సాగు, ఐఐఓఆర్ అందిస్తున్న సహకారం గురించి ఆయన ముచ్చటించారు. ఆ వివరాలు..
40 ఏళ్ల క్రితం తెలంగాణలో సరైన వర్షాలు లేక ఆహార పంటలకు అధిక ప్రాధాన్యత ఇచ్చేవారు. తమకున్న పొలంలో తమ కుటుంబానికి అవసరమైన మేర ఆహార ధాన్యాలను పండించుకొనేవారు. అనంతరకాలంలో పత్తి, మిర్చి, మక్కజొన్న తదితర వాణిజ్య పంటల వైపు మళ్లారు. అయితే, ఈసారి కేంద్ర ప్రభుత్వం వరిధాన్యం కొనుగోలుకు మొగ్గు చూపకపోవడంతో మెట్టలో వరికి బదులుగా నూనె గింజలు, పప్పుధాన్యాలు, కూరగాయలు సాగు చేసేందుకు ఆసక్తి చూపుతున్నారు.
ఎక్కువ డిమాండ్..
స్వయం సమృద్ధి సాధనలో భాగంగా 1986లో నూనెగింజల టెక్నాలజీ మిషన్ (టీఎంఓ) ఏర్పాటైంది. ఈ సంస్థ కృషి ఫలితంగా నూనె గింజల ఉత్పత్తి 10.83 మిలియన్ టన్నుల నుంచి 36.10 మిలియన్ టన్నులకు (2020-21) పెరిగింది. ఉత్పాదకత కూడా ఎకరానికి 570 కేజీల నుంచి 1254 కేజీలకు చేరుకొన్నది. ఎన్ఎఫ్ఎస్ఎం, టీఆర్ఎఫ్ఏ, సీడ్ హబ్స్, క్లస్టర్ డిమాండ్ స్టేషన్స్ లాంటి కేంద్ర పభుత్వ పథకాలు కూడా నూనెగింజల దిగుబడి పెరగడంలో ముఖ్యపాత్ర పోషించాయి. అయితే నూనెగింజల ఉత్పత్తితోపాటు నూనెల వాడకం కూడా బాగా పెరిగింది. దీనికి పెరుగుతున్న జనాభా, ఆదాయ వనరులు పెరగడం, మారుతున్న జీవన శైలి ప్రధాన కారణాలు. డీఎస్సీ – ఆర్ఏబీఓ బీఎన్కే-2011 అంచనాల ప్రకారం.. నూనెల తలసరి వాడకం 2030 కల్లా 23.10 కేజీలకు చేరుకోనున్నది. దానికి అనుగుణంగా, పెరుగుతున్న జనాభాకు తగినట్లుగా నూనె గింజల పంటలను సాగు చేయాల్సిన అవసరం ఉన్నది.
తగ్గిన సాగు..
పొద్దుతిరుగుడు, వేరుశెనగ, కుసుమ, నువ్వులు, ఆముదం వంటి నూనె పంటల సాగు తెలంగాణలో భారీగా తగ్గింది. ఉత్తరాదిలో ఆవాలు అధికంగా సాగు చేస్తూ, అక్కడి రైతులు అధిక లాభాలు పొందుతున్నారు. ఆవ నూనె దేశంలో 40 శాతం మంది మాత్రమే వాడుతున్నారు. బెంగాల్, ఉత్తర ప్రదేశ్, ఢిల్లీ, పంజాబ్, హరియానాలో ఎక్కువగా ఆవాలు సాగవుతున్నాయి. గతంలో తెలంగాణలో ఆముదం అధికంగా సాగయ్యేది. రానురానూ తగ్గిపోయింది. మనకు అవసరమైన ఆముదాన్ని గుజరాత్ నుంచి దిగుమతి చేసుకుంటున్నాం. రాష్ట్రంలో అక్కడక్కడా సాగవుతున్న నూనెగింజల విస్తీర్ణంలో 72 శాతం వరకూ చిన్న, సన్నకారు రైతులే సాగు చేస్తున్నారు. అదికూడా సారవంతం కానీ నేలల్లో, వర్షాధారంగా, పెట్టుబడి లేకుండా వ్యవసాయం చేస్తున్నారు. సరైన అవగాహన లేకపోవడం వల్ల దిగుబడి కూడా తగ్గిపోతున్నది. ఈ క్రమంలో తెలంగాణలో నూనె గింజల సాగు పెరగాల్సిన అవసరం ఉన్నది.
ఐఐఓఆర్ ప్రోత్సాహం..
నూనె గింజలను సాగు చేసే రైతులను ఐఐఓఆర్ ద్వారా ప్రోత్సహిస్తున్నాం. నేలలో తేమను కాపాడే పద్ధతులు, పోషకాల సమతుల్యత, ఉపయోగ సామర్థ్యాన్ని పెంచడం, జీవన ఎరువుల వాడకం, సూక్ష్మపోషకాలు, సల్ఫర్ వాడకం, కలుపు నివారణ చర్యలులాంటి వాటిపై ఎప్పటికప్పుడు అవగాహన కల్పిస్తున్నాం. నూతన సాంకేతికతను అందిస్తూ, రైతుల ఆదాయం పెంచేలా కృషి చేస్తున్నాం.
డా. దినేష్ కుమార్, ఐఐఓఆర్ ఇన్చార్జి డైరెక్టర్.