దామెర, ఏప్రిల్ 25: విజయవాడ-నాగ్పూర్ గ్రీన్ఫీల్డ్ ఎక్స్ప్రెస్ హైవే నిర్మాణాన్ని వ్యతిరేకిస్తూ గురువారం వరంగల్-భూపాలపట్నం జాతీయ రహదారిపై రైతులు ధర్నాకు దిగారు. హనుమకొండ జిల్లాలోని మొగుళ్లపల్లి, గట్లకానిపర్తి, రంగాపురం, సీతారాంపురం, దుర్గంపేట, వెల్లంపల్లి, పులుకూర్తి ఊరుగొండ గ్రామాలకు చెందిన వందలాది మంది రైతులు ఊరుగొండ-పసరగొండ క్రాస్ వద్దకు చేరుకుని కేంద్ర ప్రభుత్వ తీరును నిరసిస్తూ ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ దిష్టిబొమ్మను దహనం చేశారు. దీంతో జాతీయ రహదారిపై ట్రాఫిక్ పూర్తిగా స్తంభించిపోయి ఎక్కడి వాహనాలు అక్కడే నిలిచిపోయాయి. దామెర, ఆత్మకూరు పోలీసులు అక్కడికి చేరుకుని రైతులను రోడ్డుపై నుంచి పక్కకు తప్పించేందుకు యత్నించగా పోలీసులు, రైతులకు మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. ఈ క్రమంలోనే పరకాల మండలం వెల్లంలపల్లికి చెందిన లక్కం వేణు (45) పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు.
పోలీసులు రైతు వద్ద ఉన్న పురుగుల మందు డబ్బాను లాక్కొన్నారు. స్పృహతప్పి పడిపోయిన రైతు వేణును చికిత్స కోసం వరంగల్ జిల్లా ఆరెపల్లిలోని అపోలో ఎన్ఎస్ఆర్ దవాఖానకు తరలించారు. ప్రస్తుతం ఆయన పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు. ఈ సందర్భంగా రైతులు బూర్గుల రాంచందర్రావు, బొల్లు రాజిరెడ్డి, బొల్లు సమ్మిరెడ్డి మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం నిర్మించే గ్రీన్ఫీల్డ్ ఎక్స్ప్రెస్ హైవే నిర్మాణంతో తమకు జీవనాధారమైన వ్యవసాయ భూములను కోల్పోతున్నామని ఆవేదన వ్యక్తంచేశారు. ఎట్టిపరిస్థితుల్లోనూ గ్రీన్ఫీల్డ్ హైవే నిర్మాణ పనులను జరుగనివ్వమని, ఒకవేళ బలవంతంగా హైవే నిర్మాణం చేపడితే తమకు ఆత్మహత్యలే శరణ్యమని రైతులు తేల్చి చెప్పారు. గ్రీన్ఫీల్డ్ హైవే నిర్మాణం కోసం కేంద్రం ఇచ్చిన గెజిట్ నోటిఫికేషన్ను వెంటనే ఉపసంహరించుకోవాలని అన్నదాతలు డిమాండ్ చేశారు. ఈ ధర్నాలో రైతు సంఘాల నాయకులు పెంచాల సూర్యం, రవీందర్రెడ్డి, మంద సంధ్య, రాజిరెడ్డి, రైతులు పాల్గొన్నారు.