యాచారం, డిసెంబర్ 12 : దేశానికి ఒమ్రికాన్ ముప్పు పొంచి ఉన్నందున ప్రతి ఒక్కరూ మాస్కు తప్పనిసరిగా ధరించాలని, లేదంటే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని సీఐ లింగయ్య హెచ్చరించారు. ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ…మండలంలో మాస్కులు లేకుండా తిరిగే ప్రయాణికులు, ప్రజలపై నిఘాపెట్టి చట్టపరంగా రూ.1000 జరిమానా విధించనున్నట్లు తెలిపారు. అధిక జనాభాతో నిర్వహించే సభలు, సమావేశాలు, ఫంక్షన్లలో ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. శానిటైజర్లు వాడటం, భౌతిక దూరాన్ని పాటించడం, మాస్కులు ధరించాలన్నారు. ఒమిక్రాన్ నివారణకు ముందు జాగ్రత్తలు తప్పనిసరి అన్నారు. ముఖ్యంగా గ్రామాల్లో 100శాతం వ్యాక్సినేషన్ను పూర్తిచేయడానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్నారు.