హైదరాబాద్ : దక్షిణ మధ్యరైల్వే ప్రయాణికులకు శుభవార్త చెప్పింది. గత ఏడాది కరోనా ప్రేరేపిత లాక్డౌన్ నుంచి నిలిపివేసిన రైళ్లను విడుతల వారీగా ప్రారంభిస్తున్నట్లు తెలిపింది. సోమవారం నుంచి 82 రైళ్లను పునరుద్ధరించనున్నట్లు పేర్కొంది. ఇందులో 66 ప్యాసింజర్, 16 ఎక్స్ప్రెస్ రైళ్లు ఉన్నాయి. ఇవి దాదాపుగా 15 నెలల విరామం తరువాత ఈ రైళ్లు అందుబాటులోకి వస్తున్నాయి. అయితే, ఈ నెల 19వ తేదీ నుంచి వరుసగా 20, 21, 22 తేదీల్లో ఈ రైళ్లు ప్రారంభం అవుతున్నాయి. ఇవన్నీ అన్రిజర్వుడ్ సర్వీసులుగా దక్షిణ మధ్య రైల్వే పేర్కొంది. ఈ రైళ్లు ఎక్స్ప్రెస్ రైళ్లతో సమానంగా నడుస్తాయని అధికారులు స్పష్టం చేశారు. అయితే, గతంలో వివిధ నంబర్లతో నడిచిన రైళ్లకు కొత్త నెంబర్లు కేటాయించారు.
కరోనా ప్రారంభం నుంచి రైల్వే శాఖ నడుపుతున్న రైళ్లల్లో స్పెషల్ ఛార్జీల పేరుతో సాధారణ ఛార్జీ కంటే అదనంగా వసూలు చేస్తోంది. ఇప్పుడు ఈ నేపథ్యంలో ప్యాసింజర్ ఛార్జీ వసూలు చేస్తారా? ఎక్స్ప్రెస్ ఛార్జీని వసూలు చేస్తారా? అన్న విషయంపై ఇంకా స్పష్టత రాలేదు. రైళ్లలో ప్రయాణించాలనుకునే వారు స్టేషన్లలోని బుకింగ్ కౌంటర్లతో పాటు యూటీఎస్ యాప్ (ఆన్లైన్), ఏటీవీఎం (అటోమెటిక్ టికెట్ వెండిరగ్ మెషిన్లు), సీఓటీవీఎంలు (కాయిన్ టికెట్ వెండింగ్ మెషిన్స్) వాటిలో టికెట్లు తీసుకోవచ్చని అధికారులు పేర్కొన్నారు. అయితే, ప్రయాణం సమయంలో కొవిడ్ నియమాలు పాటించాలని అధికారులు సూచించారు.