అమరావతి : ఆంధ్రప్రదేశ్లో వ్యవసాయ మోటర్లకు మీటర్ల బిగింపు వల్ల కలిగే లాభాలను వివరించేందుకు అధికారులు రైతులకు లేఖలు రాయాలని ఏపీ సీఎం జగన్ అధికారులను ఆదేశించారు. ఇవాళ తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో విద్యుత్ శాఖ పై నిర్వహించిన సమీక్షా సమావేశంలో అధికారులకు పలు సూచనలు చేశారు. పైలట్ ప్రాజెక్టు కింద ఎంపిక చేసి మోటర్లకు మీటర్లు బిగించి అమలు చేస్తున్న శ్రీకాకుళంలో కలిగిన లాభాలను వివరించాలని సూచించారు.
మీటర్ల బిగింపు వల్ల రైతుపై ఎటువంటి భారం పడదని తెలిపారు. విద్యుత్ బిల్లు అంతా ప్రభుత్వమే చెల్లిస్తున్న విషయాన్ని రైతులకు వివరించాలని పేర్కొన్నారు. వ్యవసాయ పంపుసెట్లకోసం దరఖాస్తు చేసుకున్న వారికి వెంటనే కనెక్షన్లు మంజూరుచేయాలని వెల్లడించారు. థర్మల్ కేంద్రాల వద్ద సరిపడా బొగ్గు నిల్వలు ఉండేలా చూసుకోవాలని ఆదేశించారు. ఈ సమీక్షా సమావేశానికి మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఉన్నతాధికారులు హాజరయ్యారు.