హైదరాబాద్, ఏప్రిల్ 5 (నమస్తే తెలంగాణ): రాష్ట్ర రైతాంగం కోసం గల్లీ నుంచి ఢిల్లీ దాకా టీఆర్ఎస్ అలుపెరుగని పోరు కొనసాగుతున్నది. ధాన్యం సేకరణలో కేంద్ర ప్రభుత్వ కుటిల నీతిని ఎండగడుతూ టీఆర్ఎస్ ఎంపీలు పార్లమెంటును మంగళవారం స్తంబింపజేశారు. ఈ అంశంపై చర్చించాలని ఇచ్చిన వాయిదా తీర్మానాలను ఉభయ సభల్లోనూ తిరస్కరించటంతో వెల్లోకి దూసుకెళ్లి పెద్ద పెట్టున నినాదాలు చేశారు. లోక్సభలో టీఆర్ఎస్ సభా పక్ష నేత నామా నాగేశ్వర్రావు నేతృత్వంలో ఎంపీలు పోతుగంటి రాములు, గడ్డం రంజిత్రెడ్డి, పసునూరి దయాకర్, మాలోత్ కవిత, బీబీ పాటిల్, మన్నె శ్రీనివాస్రెడ్డి, వెంకటేశ్ నేతకాని ప్లకార్డులు పట్టుకొని ఆందోళన నిర్వహించారు. కల్లాల్లో, యార్డుల్లో వడ్ల రాసులు పేరుకుపోతున్నాయని, ధాన్యం కొనుగోలు చేయని కేంద్రం వైఖరిపై వెంటనే చర్చించాలని పట్టుబట్టారు. వడ్ల కొనుగోలుపై నిర్దిష్ట విధానం ఉండాలని, రాష్ట్రంపై కేంద్రం పక్షపాత వైఖరి వీడాలని డిమాండ్ చేశారు. తమ రైతాంగానికి న్యాయం చేసేదాకా ఆందోళన విరమించేదిలేదని తెగేసి చెప్పారు. దీంతో స్పీకర్ ఓం బిర్లా లోక్సభను మధ్యాహ్నం వరకు వాయిదా వేశారు. సభలో రైతుల సమస్యను పట్టించుకోని కేంద్ర ప్రభుత్వ వైఖరికి నిరసనగా వాకౌట్ చేస్తున్నట్టు నామా నాగేశ్వర్రావు ప్రకటించారు. రాజ్యసభలోనూ టీఆర్ఎస్ సభ్యులు ప్లకార్డులు పట్టుకొని ఆందోళన నిర్వహించారు. అనంతరం ఎంపీలు పార్లమెంట్ ప్రాంగణంలోని మహాత్మాగాంధీ విగ్రహం వద్ద నిరసనకు దిగారు. కేంద్రం దిగొచ్చేదాకా ఉద్యమిస్తామని ప్రతినబూనారు.
ఎస్సీ వర్గీకరణ ఎప్పటిలోగా పూర్తి చేస్తారని కేంద్ర ప్రభుత్వాన్ని ఎంపీలు గడ్డం రంజిత్రెడ్డి, వెంకటేశ్ నేతకాని, మాలోత్ కవిత, పసునూరి దయాకర్ నిలదీశారు. 2015లో రాష్ట్ర అసెంబ్లీ తీర్మానం చేసి పంపినా కేంద్రం ఇప్పటికు ఎలాంటి చర్యలు తీసుకోలేదని, అసలు ఎప్పటిలోగా ఎస్సీ వర్గీకరణ పూర్తవుతుందని ప్రశ్నించారు. తెలంగాణ అసెంబ్లీ తీర్మానం తమకు 2015 నవంబర్ 30న చేరిందని కేంద్ర సామాజిక న్యాయశాఖ మంత్రి ఏ నారాయణస్వామి లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు. ఎస్సీ వర్గీకరణతో సంబంధం ఉన్న ప్రధాన వర్గాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు, వివిధ రాష్ట్ర ప్రభుత్వాల అభిప్రాయాలతో సంప్రదింపుల ప్రక్రియ పూర్తి కాలేదని తెలిపారు. ఈ అంశం సుప్రీం కోర్టు పరిధిలో ఉన్నదని పేర్కొన్నారు.