న్యూఢిల్లీ: స్ట్రాంజా స్మారక బాక్సింగ్ టోర్నీలో భారత యువ బాక్సర్ నిఖత్ జరీన్ సెమీఫైనల్లోకి దూసుకెళ్లింది. గురువారం జరిగిన మహిళల 52కిలోల క్వార్టర్స్ బౌట్లో నిఖత్ 5-0 తేడాతో చార్లే డావిసన్(ఇంగ్లండ్)పై అద్భుత విజయం సాధించింది. తొలి రౌండ్లో బై ద్వారా నేరుగా క్వార్టర్స్లో బరిలోకి దిగిన నిఖత్ ప్రత్యర్థిపై పూర్తి ఆధిపత్యం ప్రదర్శించింది. గతం(2019)లో జరిగిన టోర్నీలో పసిడి పతకంతో మెరిసిన ఈ తెలంగాణ బాక్సర్ మరోమారు సెమీస్ చేరడం ద్వారా కనీసం కాంస్య పతకం ఖాయం చేసుకుంది. ఇంగ్లండ్ బాక్సర్పై ఆది నుంచే పదునైన పంచ్లు కురిపించిన నిఖత్…కీలక పాయింట్లు కొల్లగొట్టింది. ఎక్కడా తడబాటుకు లోనుకాకుండా నిఖత్ సంధించిన పంచ్లకు డావిసన్ దగ్గర సరైన సమాధానం లేకపోయింది. మరోవైపు 48కిలోల విభాగంలో నీతు 5-0 తేడాతో రొబెర్ట బొనాటీ(ఇటలీ)పై ఏకపక్ష విజయం సొంతం చేసుకుంది. నందిని, నిఖత్, నీతు సెమీస్ చేరడం ద్వారా టోర్నీలో ఇప్పటి వరకు భారత్ ఖాతాలో మూడు పతకాలు చేరాయి. సుమిత్ కుందు(75కి), అనామిక(50కి) ఓటములతో టోర్నీ నుంచి నిష్క్రమించారు.