బన్సీలాల్పేట్, నవంబర్ 25 : కరోనా ముప్పు ఇంకా పోలేదని, మహారాష్ట్ర, కేరళలో కేసుల సంఖ్య పెరుగుతుండటమే ఇందుకు నిదర్శనమని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని గాంధీ ఆరోగ్య కేంద్రం పీహెచ్ఎన్ సత్యమ్మ, ఏఎన్ఎం జీనత్ సూచించారు. వైద్య, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు నవంబర్ 30 లోపు ప్రజలందరూ వంద శాతం వ్యాక్సిన్ తీసుకునేలా చూడాలని చెప్పడంతో సిబ్బంది ఇంటింటికీ వెళ్లి సర్వే నిర్వహిస్తున్నామని తెలిపారు. మొదటి, రెండో డోసు వ్యాక్సిన్ తీసుకోని వారి వివరాలు నమోదు చేసుకుని తప్పనిసరిగా టీకా తీసుకునేలా వ్యాక్సిన్ ప్రాధ్యాన్యతను వివరిస్తున్నామన్నారు. ఆశవర్కర్ సుశీల, బస్తీ అధ్యక్షుడు మహ్మద్ అక్బర్, కళావతి, లక్ష్మీనారాయణ, ఉమరుద్దీన్, విజయ్ పాల్గొన్నారు.
ప్రతి ఒక్కరూ వ్యాక్సిన్ వేసుకోవాలి
జూబ్లీహిల్స్,నవంబర్25: టీకాలు వేసుకుని కరోనాపై కలిసికట్టుగా పోరాడాలని శ్రీరాంనగర్ ఎస్పీహెచ్వో డాక్టర్ అనురాధ సూచించారు. వందశాతం వ్యాక్సినేషన్ పూర్తిచేసేందుకు శ్రీరాంనగర్, బోరబండ, వినాయక్నగర్, జూబ్లీహిల్స్ పీహెచ్సీల ఆధ్వర్యంలో ఇంటింటి సర్వే, మొబైల్ వ్యాక్సిన్ శిబిరాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. గురువారం శ్రీరాంనగర్ పీహెచ్సీ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ అశ్రిత, సిబ్బందితో కలిసి రహ్మత్నగర్లో ఇంటింటి సర్వే చేపట్టారు. మెడికల్ ఆఫీసర్లు డాక్టర్ శ్రీవల్లి, డాక్టర్ జువేరియా బేగం, డాక్టర్ అమీర్ సర్వే నిర్వహించారు.