న్యూఢిల్లీ, మార్చి 4: మహాశక్తిమంతులం కనుకనే మన విద్యార్థులను విజయవంతంగా వెనుకకు తేగలిగామని మోదీ సర్కారు చెప్పుకొంటున్నది. అష్టకష్టాలు పడి విద్యార్థులు భారత్ గడ్డ మీద అడుగుపెడితే వారికి కేంద్రమంత్రులు పుష్పగుచ్ఛాలతో స్వాగతాలు పలికి ఫొటోలు దిగుతున్నారు. ‘సకాలంలో స్పందించకుండా ఇప్పుడు ఈ పూలగుత్తులు మా చేతికి ఇస్తున్నారు. వీటిని ఏంచేసుకోవాలి?’ అని ఓ విద్యార్థి నిలదీసినప్పటికీ వారి ప్రహసనం ఆగట్లేదు. నిజానికి ఉక్రెయిన్ యుద్ధం మొదలయ్యేకంటే ముందే కీవ్ నుంచి పశ్చిమాన ఉన్న ల్వీవ్కు భారత రాయబార కార్యాలయాన్ని మార్చారు. నవంబర్లోనే భారత రాయబారిని హంగరీకి తరలించింది. రాయబార కార్యాలయాన్ని, రాయబారిని సురక్షిత ప్రాంతానికి తరలించినవారు విద్యార్థులను వెనుకకు రప్పించేందుకు ఎందుకు ప్రయత్నించలేదు? అని విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఉక్రెయిన్లో సంక్షోభం బద్దలై పరిస్థితి చేయిదాటిన తర్వాతే భారతీయ విద్యార్థుల తరలింపు ఏర్పాట్ల గురించి మోదీ సర్కారు తాపీగా ఆలోచించిందని పలువురు మండిపడుతున్నారు.
ఖార్కీవ్లో మార్చి ఒకటిన నవీన్ అనే విద్యార్థి మరణించినా.. ఇంకా అతని మృతదేహం స్వదేశానికి చేరలేదు. శవపేటికకు విమానంలో స్థలం వృథా కదా! అంటూ బీజేపీ ఎమ్మెల్యే ఒకరు అమానవీయ ప్రకటన చేశారు. ఇంకా వందలాది మంది విద్యార్థులు కల్లోల ఉక్రెయిన్లోనే ఉండిపోయారు. ఆలస్యంగా మొదలుపెట్టిన తరలింపు కార్యక్రమానికి ‘ఆపరేషన్ గంగ’ అని మోదీ ఎందుకు పేరు పెట్టారో ఆయనకే తెలియాలి. యూపీ ఎన్నికలకు ఉపయోగపడుతుందేమోనని అలా పెట్టి ఉంటారని రాజకీయ పరిశీలకులు అంటున్నారు. గతంలో లిబియా, లెబనాన్, ఇరాక్ నుంచి వేలసంఖ్యలో భారతీయులను మన దౌత్యాధికారులు సురక్షితంగా, ఎలాంటి ప్రచారం లేకుండా తరలించారు. 1990లో కువైట్ నుంచి 1,70,000 మంది భారతీయులను అవలీలగా భారత్కు తీసుకువచ్చారు. కానీ అప్పటి ప్రభుత్వాలు ప్రచార యావకు పోలేదు. ఏమీ చేయకుండానే ఇప్పటి మోదీ ప్రభుత్వం మీసం మెలితిప్పుతుంటే విద్యార్థులకు కోపం రాకుండా ఎలా ఉంటుంది?