హైదరాబాద్, మే 15 (నమస్తే తెలంగాణ): విశాఖ శారదాపీఠం స్వధర్మ వాహిని పేరుతో నూతన ఆధ్యాత్మిక సంస్థను ఏర్పాటు చేసింది. ఆదివారం తిరుమలలో సంస్థ లోగోను పీఠాధిపతులు స్వరూపానందేంద్ర స్వామి, స్వాత్మానందేంద్ర స్వామి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. సనాతన ధర్మ పరిరక్షణలో నూతన ఒరవడి సృష్టించేందుకు కొత్త ఆధ్యాత్మిక సంస్థను ఏర్పాటు చేశామన్నారు.
కల్మషాన్ని పోగొట్టే పసుపు రంగు, ధర్మపథంవైపు నడిపించే తెలుపు రంగు, జ్ఞాననేత్రానికి సంకేతంగా నిలిచే కుంకుమ రంగుతో స్వధర్మ వాహిని లోగోను రూపొందించామని చెప్పారు. ధర్మ ప్రచారం పేరుతో చాలా మంది ప్రవచనాలు, ఉపన్యాసాలకే పరిమితమవుతున్నారని ఈ సంస్థ అందుకు భిన్నంగా పనిచేస్తుందని వారు వివరించారు.