శ్రీశైలం : జ్యోతిర్లింగ క్షేత్రమైన శ్రీశైల దేవస్థానానికి వచ్చే భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పించాలని, ఇందుకు ఎప్పటికప్పుడు ప్రణాళికలు రూపొందిస్తూ.. అందుకు అనుగుణంగా చర్యలు చేపట్టాలని ఆలయ ఈఓ లవన్న అధికారులను ఆదేశించారు. శనివారం ఆయన దేవస్థాన అన్ని విభాగాల అధికారులు, పర్యవేక్షకులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయా విభాగాల్లో నిర్వహిస్తున్న కార్యకలాపాలు, సిబ్బంది వివరాలు, ఆలయంలో జరిగే పూజాధికాలు, దేవస్థానం నిర్వహిస్తున్న హిందూ ధర్మ ప్రచార కార్యక్రమాలు, దేవస్థానంలో ప్రస్తుతం జరుగుతున్న ఇంజినీరింగ్ పనులు, భక్తులకు అందుబాటులో ఉన్న వసతి సదుపాయాలు, మంచినీటి సరఫరా, పారిశుధ్యం నిర్వహణ, భక్తులకు అందిస్తున్న వైద్యారోగ్య సేవలు, గోశాల నిర్వహణ, ఆగమ పాఠశాల, శ్రీశైలప్రభ ముద్రణ, సాంస్కృతిక కార్యక్రమాలు తదితర అంశాలపై ఆయన సమీక్షించారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ సిబ్బంది అంతా సమర్థవంతంగా విధులు నిర్వర్తిస్తూ దేవస్థాన అభివృద్ధికి పాటుపడాలన్నారు. ప్రతి విభాగం నైపుణ్యాన్ని పెంచుకునేందుకు కృషి చేయాలన్నారు. అన్ని విభాగాలు పరస్పర సమన్వయంతో విధులు నిర్వర్తించాలని సూచించారు. క్షేత్రాభివృద్ధికి దాతల సహకారం తీసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. దేవస్థాన పథకాలు, గోశాల, వైద్యశాల నిర్వహణ మొదలైన కార్యక్రమాలకు విస్తృత ప్రచారం కల్పించి విరాళాలు అందించే అవకాశం ఉందన్నారు. పర్యావరణ పరిరక్షణకు, క్షేత్ర సుందరీకరణలో భాగంగా పచ్చదనం పెంపొందించడంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని సంబంధిత విభాగాన్ని ఆదేశించారు. మొక్కలు నాటే కార్యక్రమాలను కూడా విరివిగా చేపట్టాలని, దేవతా మొక్కలను వీలైనంత ఎక్కువ ప్రదేశాల్లో పెంచాలని సూచించారు. ఇదిలా ఉండగా.. హైదరాబాద్ ఉప్పల్కు చెందిన జే మోహన్రావు, ఆయన కుటుంబీకులు దేవస్థానం కుటీర నిర్మాణ పథకానికి రూ.9.95లక్షలు విరాళం అందజేశారు.