సెయింట్ జాన్స్: ఇంగ్లండ్, వెస్టిండీస్ మధ్య జరిగిన తొలి టెస్టు ‘డ్రా’గా ముగిసింది. ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్లో 311 పరుగులు చేయగా.. విండీస్ 375 రన్స్కు ఆలౌటైంది. రెండో ఇన్నింగ్స్లో జాక్ క్రాలీ (121), జో రూట్ (109) సెంచరీలు నమోదు చేయడంతో ఇంగ్లండ్ 349/6 వద్ద డిక్లేర్ చేసింది. 286 పరుగుల లక్ష్యఛేదనకు దిగిన విండీస్ చివరి రోజు ఆట ముగిసే సమయానికి 4 వికెట్లు కోల్పోయి 147 పరుగులు చేసింది. ‘మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్’ బొనర్ (138 బంతుల్లో 38 నాటౌట్), హోల్డర్ (101 బంతుల్లో 37 నాటౌట్) కడదాకా పోరాడారు. ఫలితం తేలే అవకాశం లేకున్నా.. నిర్ణీత ఓవర్ల వరకు ఇంగ్లండ్ ఆట కొనసాగించడంపై విండీస్ కెప్టెన్ బ్రాత్వైట్ ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఆస్ట్రేలియా, భారత్ వంటి జట్లతో మ్యాచ్ అయితే ఇంగ్లండ్ ఇలా చేసి ఉండేది కాదని.. తమను తక్కువ అంచనా వేస్తూ అమర్యాదకరంగా వ్యవహరించడం నచ్చలేదని వాపోయాడు.