హైదరాబాద్ సిటీబ్యూరో, అక్టోబర్ 19 (నమస్తే తెలంగాణ): జేఎన్టీయూహెచ్, ఓయూ, ఇతర యూనివర్సిటీ పరిధిలోని ఇంజినీరింగ్ కళాశాలల్లో నవంబర్ మొదటివారంలో ఫస్టియర్ క్లాసులు ప్రారంభించాలని ఎంసెట్ అడ్మిషన్ అధికారులు భావిస్తున్నారు. ఒకటి రెండురోజుల్లో జరిగే ఎంసెట్ అడ్మిషన్ కమిటీ సమావేశంలో రెండోవిడత కౌన్సెలింగ్ తేదీలు, విద్యాసంవత్సరం ప్రారంభం వంటి వివరాలు వెల్లడిస్తామని జేఎన్టీయూ అధికారులు తెలిపారు. సెప్టెంబర్ మూడోవారంలోనే ఎంసెట్-21 తొలివిడత అడ్మిషన్ కౌన్సెలింగ్ పూర్తిచేశారు. మొత్తం 175 ఇంజినీరింగ్ కాలేజీల్లో 60,941 సీట్లు నిండాయి. ఇంకా 13,130 సీట్లు మిగిలాయి. వీటిని రెండోవిడత కౌన్సెలింగ్లో భర్తీచేయనున్నారు.