అమీర్పేట్ : నాలాల రీమోడలింగ్ పనులకు అడ్డంకిగా మారిన నాలా ఆక్రమణలను వెంటనే తొలగించాలని ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్యాదవ్ (MLA Thalasani Srinivas Yadav) అధికారులను ఆదేశించారు. మంగళవారం ఆయన అమీర్పేట్ గాయత్రీనగర్లో చేపడుతున్న నాలా రీమోడలింగ్ పనులను జీహెచ్ఎంసీ అధికారులతో కలిసి పరిశీలించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నాలా రీమోడలింగ్ పనులు సగభాగం పూర్తయ్యాయని, ఆక్రమణల కారణంగా పనులు ముందుకు సాగడం ఇబ్బందికరంగా మారిందని అధికారులు ఎమ్మెల్యే దృష్టికి తీసుకొచ్చారు. గాయత్రీనగర్లో వరద ముంపు సమస్య పరిష్కారానికి తీసుకున్న చర్యల్లో భాగంగా నాలా రీమోడలింగ్ పనులు జరుగుతున్నాయని, ఈ విషయంలో నాలా ఆక్రమణలకు (Encroachments) ఎవరూ పాల్పడినా ఉపేక్షించ వద్దని, వెంటనే తొలగించే పనులు చేపట్టాలని అధికారులకు సూచించారు.
వయోధికుల్లో చురుకుదనం కోసం..
ఎస్ఆర్నగర్ వయోధికుల మండలి ప్రతినిధుల కోసం ఏర్పాటు చేసిన ఓపెన్ జిమ్( Open gim) ను ఎమ్మెల్యే ప్రారంభించారు. వయోధికులను ఎల్లప్పుడూ ఉత్సాహంగా ఉంచేందుకు వీలుగా మండలి కార్యాలయ ఆవరణలో వ్యాయామాలు చేసుకునేందుకు వీలుగా ఓపెన్ ఎయిర్ జిమ్ ఏర్పాటు చేశామని తలసాని వివరించారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ కొలను లక్ష్మి బాల్రెడ్డి, వయోధికుల మండలి అధ్యక్షులు మాణిక్రావు పాటిల్, ముఖ్య సలహాదారు కాసాని సహదేవ్గౌడ్ తదితరులు పాల్గొన్నారు.